హోదా కోసం కాదు, ప్యాకేజీ కోసమే: బాబుపై మైసూరా
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చర్యల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.ఏపి ప్రభుత్వమే ప్రత్యేక హోదాను నీరుగారుస్తోందని మైసూరారెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని ప్రజలు కరువు పరిస్థితులు తట్టుకోలేక వలసలు పోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు.
'మద్దతు ధర అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 25 శాతమే ధాన్యం సేకరణ జరుగుతోంది. పత్తికి కూడా కనీస మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ హామీ.. ఎన్నికలకే పరిమితమైంది. ఓ పక్క కరువు. మరో పక్క మద్దతు ధర లేదు. ఇన్ని బాధలుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది' అని మైసూరా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
‘పంటల నష్టంపై అంచనాలు వేయడం లేదు. కేంద్రానికి నివేదికలు సరిగా పంపడం లేదు' అని మైసూరా ఆరోపించారు. మే 4, 5 తేదీల్లో మండలస్థాయి నుంచి ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని డిమాండ్ చేశారు.