టీడీపీలోకే మైసూరా?: అసలు విషయం ఇదీ, రెస్టారెంట్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు
అమరావతి: మైసూరా రెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడికి వైయస్ జగన్కు ఈ మెయిల్లో పంపిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. జగన్కు మానవీయత లేదని, టిఫిన్ కోసం రమ్మని తన మెడలో కండువా వేశారని తనకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదని చెప్పారు.
అయితే మైసూరా రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతేకాదు గతంలో మైసూరా రెడ్డి కుమారుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మధ్య జరిగిన ఒక సంఘటనను వైసీపీ నేతలు గురువారం ప్రస్తావించారు.
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైసూరా రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ సమయంలో మైసూరా కుమారుడు ఏదో పనిమీద వైయస్ను కలిసేందుకు వెళ్లారు. వైయస్కు ఒక చీటి ఇచ్చి ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారని మైసూరారెడ్డి కుమారుడు చెప్పారు.
అందులో ఒక బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతి ఇప్పించాలని రాసి ఉందని చెబుతున్నారు. దానిని చదివిన వైయస్ రాజశేఖరరెడ్డి వెంటనే దానిని చించి పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడేశారట. 'మీ నాన్న గురించి నాకు తెలుసు. మైసూరా స్ధాయి ఏంటో కూడా నాకు తెలుసు. ఇలాంటి చిన్న చిన్న వాటితో పరువు తీయవద్దు. మీ నాన్న స్థాయికి తగ్గ ప్రతిపాదన ఏదైనా ఉంటే తీసుకునిరా పరిశీలిద్దాం' అని చెప్పారట.
అలా వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీతోనే కాంగ్రెస్ సీనియర నేత సి. రామచంద్రయ్య కుటుంబీకుల నుంచి రఘరాం సిమెంట్స్ మైసూరా చేతికి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలా సిమెంట్ కంపెనీ అనుమతులు పూర్తిగా రాకుండానే వైయస్ చనిపోయారట.
దీంతో ఆ ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు సిమెంట్ కంపెనీని మైసూరా సొంతూరు నిడిజువ్వి సమీపంలో ఏర్పాటు చేయాలని మైసూరా భావిస్తున్నారట. సిమెంట్ కోసం తవ్వే ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ భూములు ఉండటం, రైల్వే ట్రాక్ కోసం ప్రభుత్వ భూమి అవసరం పడటం లాంటి కారణాలతో మైసూరా రెడ్డి మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఉంటాయో చెప్పడం కష్టం. అంతేకాదు ఎవరికి వారు వారి సొంత లాభం కోసమే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల కోసం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.