వైసీపీకి మైసూరా రాజీనామా?: జగన్పై ఉన్న అసంతృప్తే కారణమా?
అమరావతి: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి బుధవారం రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను ఈరోజు ఉదయం 10 గంటలకు ఫ్యాక్స్లో నేరుగా జగన్కే పంపనున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో ఉన్న మైసూరా... పార్టీ వీడేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, పార్టీలో ఎదురైన ఇబ్బందులు, పార్టీ నిర్వహణలో లోపాలపై ఆయన లేఖలో స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. మైసూరా కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ను సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు, కష్టాల్లో ఉన్న పార్టీని మైసూరా రెడ్డి ముందుండి నడిపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ గౌరవం లేకపోయిందనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
అంతేకాదు జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి మైసూరాకు నెమ్మెదిగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. రాయలసీమ విషయంలోనూ జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అసంతృప్తితో మైసూరా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా అనంతరం ఆయన టీడీపీలోకి చేరతారా? అనే దానిపై స్పష్టత లేదు.
మీడియాలో మాత్రం ఆయన టీడీపీలో చేరనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇలా జగన్ సొంత జిల్లా కడపకు చెందిన మైసూరారెడ్డి పార్టీ వీడటం వైసీపీకి తీరని నష్టమేనన్న వాదన వినిపిస్తోంది. కాగా వైసీపీ నుంచి రాజ్యసభ సీటుని ఆశించిన మైసూరా అది దక్కక పోవడం వల్లనే పార్టీ మారుతున్నారనే వాదన కూడా ఉంది.