140 ఎకరాల భూమి కేటాయింపు!: ఆగస్టులో టిడిపిలోకి మైసూరా రెడ్డి?
విజయవాడ/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిని సీనియర్ నేత, మాజీ మంత్రి మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 140 ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలో టిడిపిలో చేరిక దాదాపు ఖరారైపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్కు మానవీయత లేదని, టిఫిన్ కోసం రమ్మని తన మెడలో కండువా వేశారని తనకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరేందుకే జగన్పై విమర్శలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలో మైసూరా కుటుంబసభ్యుల నేతృత్వంలో స్థాపించనున్న 'తేజ సిమెంటు ఫ్యాక్టరీ'కి ఎర్రగుంట్ల మండలంలో 140 ఎకరాల ప్రభుత్వభూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న ఈ భూమి మార్కెట్ విలువ రూ.25 లక్షలకు పైగా ఉండగా.. ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షలకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వ భూమి దక్కడం, ఇదివరకే ప్రైవేటు భూములను కొనుగోలు చేసిన నేపథ్యంలో తేజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సెప్టెంబర్లో శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
టీడీపీలోకే మైసూరా?: అసలు విషయం ఇదీ, రెస్టారెంట్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు
ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా హాజరవుతారని తెలిసింది. అందుకే, ఆగస్టులో టీడీపీలో చేరేందుకు మైసూరా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తేజ సిమెంటు ఫ్యాక్టరీ ప్రమోటర్గా మాజీమంత్రి మైసూరారెడ్డి సోదరుడు శ్రీనివాసులరెడ్డి, షేర్హోల్డర్లుగా మరికొంతమంది మైసూరా బంధువులు ఉన్నట్లు తెలిసింది.