కన్నా-సోము వీర్రాజులకు బాధ్యతల వెనుక: బీజేపీ 'థర్డ్' ప్లాన్, టార్గెట్ చంద్రబాబు
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను, పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ వ్యూహాత్మకంగానే కన్నాకు పదవి కట్టబెట్టిందని అంటున్నారు. పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టి, కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నాకు పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
కన్నాకు పదవా?: బీజేపీలో రాజీనామా కలకలం, సోము వీర్రాజు ఆగ్రహం, ట్విస్ట్.. నాడే అమిత్ షా హామీ
టీడీపీ పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారని కంభంపాటి హరిబాబును పక్కన పెట్టారు. చంద్రబాబుపై నిత్యం విమర్శలు గుప్పించే కన్నా, సోము వీర్రాజులకు పదవులు ఇచ్చారు. సాధారణంగా బీజేపీలో కులాలకు ప్రాధాన్యత ఉండదని అంటారు. అందరికీ ప్రాధాన్యం ఉంటుంది.
ఇక్కడ అదే తరహా ప్రయోగం
కానీ ఏపీలో పార్టీ ఎదగాలనే లెక్కలతో ఈ పదవులు ఇప్పగించారని తెలుస్తోంది. తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న కన్నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వ్యూహాత్మకమే అంటున్నారు. అసోంలో సంఘ్ నేపథ్యం లేని శరబానంద సోనోవాల్ను పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో విజయం సాధించి, ఆయనను సీఎం చేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే తరహా ప్రయోగం చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
మూడో బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు
ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మూడో బలమైన సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ యోచించిందని అంటున్నారు. అందులో భాగంగానే ఆ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని చెబుతున్నారు. తొలుత పైడికొండల మాణిక్యాల రావుకు ఇవ్వాలనుకున్నారు. రాంమాధవ్ పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఆకుల సత్యనారాయణ, సోము వీర్రాజు తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి.
ఎలా చూసినా ఇద్దరే మిగలగా..
సోము వీర్రాజును పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. దీంతో పార్టీ అధిష్టానం కన్నా వైపు చూసిందని అంటున్నారు. పార్టీలోని కొందరు వ్యతిరేకించకుంటే సోము వీర్రాజుకే పట్టం కట్టేవారని చెబుతున్నారు. అయితే, పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎలా ఇస్తారని ఇప్పుడు మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని ఇరుకున పెట్టేందుకు, ఆ పార్టీపై ఎదురు దాడి చేసేందుకు, అలాగే సామాజిక వర్గం కోణంలో.. ఎలా చూసినా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు మిగులుతున్నారు.
అలా కన్నా వైపు మొగ్గు చూపారు
చివరకు కన్నా వైపు మొగ్గు చూపారు. ఈ దశలో పార్టీలో సీనియర్ సోము వీర్రాజుకు కూడా దాదాపు అదే ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు కూడా పదవి కట్టబెట్టారు. కాగా, కర్నాటక ఎన్నికలకు ముందే ఈ విషయమై ఢిల్లీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని, కానీ అక్కడి తెలుగు వారిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల తర్వాత ప్రకటన చేశారని అంటున్నారు.
చంద్రబాబుపై ఎదురుదాడే లక్ష్యం
ఎన్డీయే నుంచి వైదొలగిన టీడీపీపై ఎదురుదాడి చేయడమే ఉద్దేశంగా కన్నా, వీర్రాజు నియామకాలు జరిగినట్లు భావిస్తున్నారు. కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష పదవికి పురంధేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే అన్ని విధాలా ఆమె అర్హురాలే అయినప్పటికీ సామాజిక కోణం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.