కర్ణాటకలో బీజేపీకి షాక్, కాంగ్రెస్ ప్రభుత్వం: మమత-మాయావతితో బాబు ఏంచెప్పారంటే?
అమరావతి/బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఓటమి వెనుక (బీజేపీకి 104, కాంగ్రెస్కు 77, జేడీఎస్కు 38 స్థానాలు దక్కాయి) తెలుగుదేశం పార్టీ ఉందని, ఇక్కడి తెలుగు ఓటర్లకు తాము పిలుపునివ్వడంతో ఆ పార్టీని ఓడించారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నేతలతో చర్చల సందర్భంగా చెప్పారట.
Recommended Video
కర్ణాటక ఎన్నికలకు ముందు చంద్రబాబు, టీడీపీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చాయి. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గెలవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ పిలుపునివ్వడంతో బీజేపీపై దెబ్బపడిందని ఆయన మాయావతి, మమతా బెనర్జీ, ఏచూరి వంటి వారితో చెప్పారని అంటున్నారు.
ఊహించని ట్విస్ట్: చేయి కలిపి రాహుల్ భుజం తట్టిన చంద్రబాబు, ఏకమైన 14 పార్టీలు, వేర్వేరుగా చర్చలు
ప్రమాణ స్వీకారానికి ముందే చర్చలు
ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు తొలిసారి బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరీ తదితరులతో వేర్వేరుగా, కొందరితో కలిసి మాట్లాడారు. జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మాయావతి, మమతలు చంద్రబాబుకు సూచించారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు ఇతర రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలతో మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ నేతలు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అందరు కలిసి భోజనం చేశారు.
హోదాపై జాతీయస్థాయి నేతల మద్దతు
చంద్రబాబు బెంగళూరులో మమతా బెనర్జీ, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరీ, డీ రాజా తదితరులతో చర్చలు జరిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, సీఎం కుమారస్వామిలతోను బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చించారు. సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు.. కూటమి కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై అందరి మద్దతును అడిగారు. తాము అండగా ఉంటామని పలువురు నేతలు చెప్పారని తెలుస్తోంది.
కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్
చంద్రబాబు బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో చేయి కలిపారు. దీంతో ఆయన కాంగ్రెస్తో జత కడుతున్నారనే ప్రచారం సాగింది. అయితే ఆయన మాత్రం కాంగ్రెస్సెతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు.
జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా త్వరలో ప్రయత్నాలు
జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా చంద్రబాబు త్వరలో ప్రయత్నాలు సాగించే అవకాశముందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఆయా ప్రాంతీయ పార్టీల నేతలను కలవనున్నారని తెలుస్తోంది. అనంతరం అమరావతిలో ఓ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.