'నిశ్చితార్థం జరిగింది, ఇక పెళ్లే! అందుకే ముఖం చెల్లక జగన్ బెంగళూరుకు వెళ్లలేదు'
అమరావతి: కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి విరుద్ధ భావాలు కలిగిన 13 పార్టీలు కలిశాయి. బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మినహా వామపక్షాలు, మమతా బెనర్జీ, మాయావతి తదితరులతో కేంద్రం అంశంపై చర్చించారు. రాహుల్ గాంధీతో చేయి కలిపారు. దీనిపై వైసీపీ, బీజేపీ విమర్శలు గుప్పించింది.
దీనికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అందుకు బెంగళూరులో జరిగిన ప్రాంతీయ, లెఫ్ట్ పార్టీల భేటీ నాంది కానుందని తెలిపారు.
తెలంగాణ పరిస్థితి తెచ్చుకోవద్దు, కరెంట్ తీసి నాపై దాడి ప్రయత్నమా, బట్టలూడదీసి కొడతా: ఊగిపోయిన పవన్
2019లో 25 స్థానాలు టీడీపీవే
2019 ఎన్నికల్లో ఏపీలోని 25 లోకసభ స్థానాలకు గాను మొత్తం స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని యనమల వెల్లడిండారు. బీజేపీ తప్ప మరే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు తీయదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలు రెండు ఒక్కటవుతాయని తెలిపారు.
బీజేపీతో వైసీపీకి నిశ్చితార్థం
ఇప్పటికే బీజేపీతో వైసీపీకి నిశ్చితార్థం అయిందని యనమల చెప్పారు. 2019ని పెళ్లి ముహుర్తంగా నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కావడాన్ని తప్పుబట్టడంపై మండిపడ్డారు. కాంగ్రెస్తో తాము చర్చలు జరపలేదన్నారు.
బీజేపీకి పని చేసిన జగన్, ముఖం చెల్లక రాలేదు
బెంగళూరులో సీఎం చంద్రబాబు ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో భేటీ అయి ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించారని యనమల తెలిపారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున పని చేశారు కాబట్టే ముఖం చెల్లక ప్రమాణ స్వీకారానికి జగన్ గైర్హాజరయ్యారన్నారు.
బీజేపీతో పొత్తు కోసమే జగన్ బెంగళూరు వెళ్లలేదు
బీజేపీతో పొత్తుకోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ బెంగళూరుకు వెళ్లలేదని యనమల చెప్పారు. వేదికపై ఎదురైనపుడు ఒకరికొకరు అభినందించుకోవడం భారతీయ సంస్కారమని, అందుకే రాహుల్ - చంద్రబాబులు చేయి కలిపారని తెలిపారు. దానిని కూడా బీజేపీ, వైసీపీలు తప్పుపట్టడం వారి దివాలాకోరుతనమన్నారు.