నబీల్ను గేలి చేసి రెచ్చగొట్టారు, ప్రేమ కథ ఉట్టిదే: స్ట్రీట్ఫైట్పై డిసిపి
హైదరాబాద్: మృతుడు నబీల్ను మిత్రులు అవహేళన చేసి, రెచ్చగొట్టి స్ట్రీట్ఫైట్లోకి దించారని డిసిపి వి. సత్యనారాయణ చెప్పారు. ఇతరుల కన్నా తాము ఎక్కువ అనే పోటీ కారణంగా ఇది చోటు చేసుకుందని ఆయన అన్నారు. స్ట్రీట్ ఫైట్ అంతా వైఫై వ్యవహారమని ఆయన అన్నారు.
స్ట్రీట్ఫైట్లో మృతిచెందిన నబీల్ కేసులో ప్రేమ వ్యవహారం లేదని సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన ప్రకటించారు. నబీల్ శరీరంపై తొమ్మిది చోట్ల గాయాలున్నాయని, బలమైన పంచ్ల వల్ల తలకు తీవ్ర గాయం కావడంతో నవీల్ మరణించాడని డీసీపీ చెప్పారు.నిందితులపై 302, 201,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఎచ్చులు, బడాయిల వల్లే నబీల్ మొహమ్మద్ నబీల్ మృతికి దారి తీశాయని సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీ మీరాలంమండికి చెందిన నబీల్ అహ్మద్ స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు.
బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం, అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాబం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు.
స్ట్రీట్ఫైట్లో నబీల్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు. అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు సత్యనారాయణ చెప్పారు. ఇటువంటి స్ట్రీట్ ఫైట్స్ ఇది వరకు జరగలేదని ఆయన చెప్పారు.