అమిత్ షాతో నాదెండ్ల భేటీ..అధికారికంగా బీజేపీలోకి: ఆయన బాటలోనే...!
బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు చేరిన తరువాత ఆ పార్టీకి చెందిన నేతల మీద బీజేపీ దృష్టి సారించింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం టీడీపీతో పాటుగా జనసేన..వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తారని ప్రకటనలు అయితే ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆయనతో భేటీకి నాదెండ్ల ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అధికారికంగా షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు.
Recommended Video
తండ్రి షాతో..తనయుడు పవన్తో..
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు ఇప్పుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లగా ఆయనతో పాటుగా నాదెండ్ల మనోహర్ సైతం వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలోనే ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర రావు బీజేపీలో చేరాలని నిర్ణయించారు. 85 ఏళ్ల భాస్కర రావు క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పటికీ.. రాజకీయ పరిణామాల పైన స్పందిస్తూనే ఉన్నారు. తనయుడు మనోహర్ జనసేనలో చేరటం పైనా ఆ సమయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాన్ మీద మనోహర్కు ఎందుకు అభిమానమో ఆయనకే తెలియాలని..ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. అయితే, తాజా ఎన్నికల్లో జనసేన వైఫల్యం తరువాత తన కుమారుడికి సైతం రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకోవా లని సూచించినట్లు సమాచారం.
అమిత్షాతో భేటీ..బీజేపీలో చేరిక
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరుతున్నారు. శనివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షాను కలిసి ఆయన సమక్షంలో బీజేపీలో చేరాలని భాస్కర రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ అధి నాయకత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసారు. భాస్కర రావు తొలి సారిగా 1978లో ఎమ్మెల్యే అయ్యారు. 1983లో ఎన్టీఆర్తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు... అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. భాస్కర రావు తనయుడు మనోహర్ తెనాలి నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిన మనోహర్ తాజా ఎన్నికల్లో అదే తెనాలి నుండి జనసేన అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.
మనోహర్ సైతం మనసు మార్చుకుంటారా..
ఎన్నికలు ముగిసిన నాటి నుండి జనసేనకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు. బీజేపీ నుండి 2014లో గెలిచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ తాజా ఎన్నికల్లో జనసేన అభ్యర్దిగా పోటీ చేసి ఓడి..తిరిగి బీజేపీలో చేరారు. అదే విధంగా మాజీ మంత్రి రావెల కిషోర్బాబు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులుగా మనోహర్ సైతం జనసేన వీడుతారనే ప్రచారం ఉంది. అయితే, మనోహర్ మాత్రం గతంలో పవన్తో ఎలా ఉండేవారో అదే విధంగా ఇప్పుడు కూడా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మనోహర్ పార్టీ వీడే అవకాశం లేదని ఆయన సన్నిహితులు కొద్ది రోజుల క్రితం వివరణ ఇచ్చారు. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా నాదెండ్ల భాస్కరరావు బీజేపీ లో చేరటం..భవిష్యత్లో తన కుమారుడికి ప్రాధాన్యత కలిగించేలా చేసే వ్యూహంలో భాగంగానే అని ప్రచారం మాత్రం సాగుతోంది. దీంతో..నాదెండ్ల మనోహర్ భవిష్యత్లో జనసేనలోనే ఉంటారా..లేదా అనేది ఆయనే స్పష్టత ఇవ్వాలి.