ఉత్తరాంధ్ర పర్యటన నుండి వ్యూహ రచన వరకూ అన్నీ మనోహరేనా..? అనే వాళ్లకు పవన్ సమాధానం ఇదే.. !!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు గమ్మత్తుగా సాగుతుంటాయి. సొంత పార్టీ మీద ఉండని శ్రద్ద ఇతర పార్టీల మీద చూపిస్తుంటారు నేతలు. సొంత పార్టీలో కన్నా ఇతర పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని తెగ ఉబలాటపడుతుంటారు కొంత మంది నాయకులు. ఇలాంటి వాతావరణం అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాజకీయ పార్టీల్లో సర్వ సాధారణంగా సాగే తంతు ఐనప్పటికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాస్త డోస్ ఎక్కువగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, పార్టీ బాధ్యతలనంతా నాదెండ్ల మనోహర్ మీదనే వేసారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటైన సమాధానం ఇస్తున్నారు.
జనసేనలో నంబర్ టూ గా నాదెండ్ల మనోహర్.. పూర్తి స్వేఛ్చనిచ్చిన పవన్ కళ్యాణ్..
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రస్దానం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. 2014లోనే పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పటికి ఆయన అప్పటికి పార్టీ స్థాపించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2014లో తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు పవన్. లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్రంతో పాటు, రాజధాని కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడికి అవకాశం ఇవ్వాలని కాంక్షించారు పవన్ కళ్యాణ్. తాను కోరుకున్నట్టే ఏపిలో 2014లో టీడిపి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తర్వాత అనేక రాజకీయ మలుపులు, కారణాల తర్వాత పవన్ కళ్యాణ్ తను రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్టు, దాని పేరు జనసేన పార్టీగా ప్రకటించారు.
పార్టీలో అన్నీ తానై ముందుకెళ్తున్న నాదెండ్ల.. ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసిన మనోహర్..
2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి తాను అనుకున్నట్టు మార్పును రాజకీయాల్లో తీసుకురావాలని పవన్ సంకల్పించారు. అందులో భాగంగా రాష్ట్రం నలుమూలలా పర్యటించారు పవన్ కళ్యాణ్. ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ మారు మూల కుగ్రామానికి వెళ్లినా జనాలు పవన్ కళ్యాణ్ సభలకు హోరేత్తేవారు. యువత ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టేవారు. ఇక పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి పూనకం వచ్చిన వారిలా ఊగిపోయే వారు పవన్ అభిమానులు. కాని 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి నిరాశను మిగిల్చాయి. ఐనప్పటికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టైందనే చర్చ జరిగింది.
పార్టీ క్యాడర్ కు అందుబాటులో నాదెండ్ల.. పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న మాజీ స్పీకర్..
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం తర్వాత పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో అపార అనుభవం సాధించేంత వరకు ఏదేని జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే శ్రేయస్కరమని పవన్ భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన పవన్ ఆ దిశాగా చకచకా అడుగులు వేసారు. సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూనే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా రన్నింగ్ లో ఉంటే రోజుకు సుమారు వెయ్యిమందికి జీవనోపాది ఉంటుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఐతే ఇదే సమయంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న నాదేండ్ల మనోహర్ పై, జనసేన అధినేతపైన విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
Recommended Video
మనోహర్ జోక్యం పై విమర్శలు.. ఘాటుగా సమాధానం ఇచ్చిన పవర్ స్టార్..
జనసేన బీజేపితో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, పార్టీని పూర్తిగా నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టేసారని పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శలకు పవన్ తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. పార్టీ పటిష్ట నిర్మాణానికి ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని, అన్ని కార్యక్రమాలు తానే నిర్వర్తిస్తే మిగతా నాయకులకు ప్రజల్లో ఎలా గుర్తింపు వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన మొత్తం మనోహర్ ఒక్కరే పూర్తి చేయడంతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల దిశానిర్ధేశం కూడా మనోహర్ ఇవ్వడాన్ని పవన్ సమర్ధించారు. సచ్చీలత, సమర్ధత, ఉన్న నేతల అనుభవాన్ని ఉపయోగించుకునే క్రమంలో వారిక స్వేఛ్చనివ్వడం ఎలాంటి తప్పు కాదని, అది పార్టీ పటిష్టతకు ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ కు కూడా ఇదే సందేశాన్ని పంపినట్తు తెలుస్తోంది.