మెట్రో రైలు అలా కుదరదు: నాదెండ్ల మనోహర్
గుంటూరు: మెట్రో రైలు ప్రాజెక్టును విజయవాడ నగరానికి మాత్రమే పరిమితం చేయడం సరి కాదని శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెసు నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆలా చేయడం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, నగరాలతో పాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రో రైలును నిర్మిస్తే ఆ ప్రాజెక్టుతో పాటు మంచి రాజధాని ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఓ అధికారి సూచనతో మెట్రో రైలు ప్రాజెక్టును ఓ నగరానికి మాత్రమే పరిమితం చేయడం సబబు కాదని ఆయన అన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో 12వ ప్రతిపాదన మేరకు విజిటిఎం పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ స్థితిలో పునర్విభజన చట్టంలోని అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు రూపశిల్పి శ్రీధరన్ ఇటీవల మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆయన విజయవాడ నగరాన్ని మాత్రమే ఎంచుకున్నారు. శ్రీధరన్ పరిగణన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ మెట్రో రైలు ప్రాజెక్టుపై స్పందించారు.