నేనే హీరోను, చంద్రబాబు విలన్: బాలయ్య ఎన్టీఆర్ సినిమాపై నాదెండ్ల
ఎన్టీఆర్పై బాలయ్య తీయబోయే సినిమాపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. తమను విలన్లుగా చూపిస్తే పచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
హైదరాబాద్: తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితచరిత్రను తెరకెక్కిస్తానని నందమూరి హీరో బాలకృష్ణ ప్రకటించడమే తరువాయి ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఆ సినిమాను ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని బాలకృష్ణ చెప్పినప్పటికీ కొంత మంది తమ వాదనను వినిపిస్తున్నారు.
ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఇప్పటికే ఆ సినిమాపై స్పందించారు. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కూడా స్పందించారు. ఆయన మంగళవారం సాయంత్రం ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్తో మాట్లాడారు. ఎన్టీఆర్పై తీసే సినిమాలో తానే హీరోను అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలన్ అని ఆయన అన్నారు.
తమను విలన్లుగా చూపిస్తే మీడియా ముందుకు వచ్చి పచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది తానే అని ఆయన చెబుకున్నారు. టిడిపిని ఎన్టీ రామారావు స్థాపించారని స్వార్థం కోసం కొంత మంది చెబుతుంటారని ఆయన అన్నారు.
బాలకృష్ణ తనను సంప్రదిస్తే సినిమా ఎలా తీయాలో చెబుతానని ఆయన అన్నారు. పరిణామాలపై బాలయ్యకు కొన్ని విషయాలు తెలుసునని ఆయన అన్నారు. తమ మీద, తమ రాజకీయ జీవితం మీద సినిమా ప్రభావం చూపిస్తే బయటకు రావాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఎన్టీరామారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసి నాదెండ్ల భాస్కర రావు ఆ పదవిని దక్కించుకున్న విషయం తెలిసిందే. తీవ్ర ఆందోళన నేపథ్యంలో తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.