స్మార్ట్ పల్స్ సర్వే: 'బాబు సీక్రెట్ అజెండా, వారి చేతుల్లోకి సమాచారం'
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం నాడు అన్నారు. సర్వేలో 25కు పైగా పత్రాలు అడుగుతున్నారని, దీని వల్ల భవిష్యత్లో మన సమాచారమంతా అసాంఘికశక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.
స్మార్ట్పల్స్ సర్వే వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ఈ సర్వే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రజలు కూడా స్మార్ట్పల్స్ సర్వేను వ్యతిరేకించాలన్నారు. యూపీఏ ఆధార్ను ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.
విచారణ కమిటీ వేస్తాం: కామినేని
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్న కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం స్పందించారు.
ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం గతంలోనూ కర్నూలులోనే బయటపడిందని, దానిపై వేసిన కమిటీ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోందన్నారు. ఈ కుంభకోణంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు.