మెగా ఫ్యామిలీలో ‘గాడ్సే’ చిచ్చు, ట్విస్ట్.. నాగబాబుపై చిరంజీవి సొంతపార్టీ ఫైర్..
''మెగాస్టార్గా పేరుపొందిన చిరంజీవేమో గాంధీజీపై, గాంధీగిరీపై అద్భుతమైన సినిమాలు తీస్తాడు.. అతని పెద్ద తమ్ముడు, టవర్ స్టార్గా పిలిపించుకునే నాగబాబు మాత్రం గాంధీని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడని కీర్తిస్తాడు.. అటు చూస్తే, చిన్న తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణేమో కమ్యూనిజం సినిమాలు తీసి, దేశభక్తి లెక్చర్లు దంచుతాడు.. అరే.. ఒకే ఫ్యామిలీలో ఇన్ని ట్విస్టులేందిరా భాయ్..''అని వాపోయారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు.
పులివెందులకే నీళ్లిచ్చాను, జగన్ అజ్ఞాని.. కేసీఆర్ మంచోడా? ఏపీని ముంచేస్తే?.. చంద్రబాబు సంచలనం..
నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయనపై నటుడు నాగబాబు చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించిన నాగబాబు.. ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేశాడని, గాంధీని చంపడానికి అతని వైపు ఆర్గ్యుమెంట్ ను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని, ఇప్పటికీ గాడ్సేను సరిగా అర్థంచేసుకోవడంలేదంటూ ట్వీట్ చేశారు. ఈ వివాదంపై అందరికంటే ఎక్కువగా, చిరంజీవి సొంత పార్టీ కాంగ్రెసే తీవ్రంగా స్పందించింది.
''మన్నించు మహాత్మా..''అంటూ టీకాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేయగా, మాజీ ఎంపీ వీహెచ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ నాగబాబు మాటలు వింటే ఈతరం పిల్లలు గాంధీని మర్చిపోయే ప్రమాదముందని అన్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి సైతం నాగబాబుపై మండిపడ్డారు. ''నీ తెలివితక్కువతనంతో మీ అన్న చిరంజీవి పరువు తీయొద్దు..''అని హితవుకు పలికారు.
గాంధీ హంతకుడు గాడ్సేను దేశభక్తుడంటూ నాగబాబు కీర్తిన తర్వాత మెగా ఫ్యామిలీ సభ్యులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతోన్న చిరంజీవిపై, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా, నటుడు రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ తదితరులను ''నాగబాబు కామెంట్లపై మీ స్టాండ్ ఏంటి?''అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. స్వతహాగా గాంధీని అమితంగా ఇష్టపడే చిరంజీవి.. సోదరుడు నాగబాబు కామెంట్లపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. బీజేపీతో జనసేన జట్టుకట్టిన తర్వాత పవన్, నాగబాబులు నాగపూర్ మెంటాలిటీని అడాప్ట్ చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.