అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను: ఈసారి మంత్రిని టార్గెట్ చేసిన నాగబాబు
అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు దేశభక్తుడిగా కీర్తించి, వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు. మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ఈ సారి ఆయన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస రావును టార్గెట్గా చేసుకున్నారు. ఆయనపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.. ట్విట్టర్ ద్వారా.
విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు వెలువడిన అనంతరం అక్కడి పరిస్థితులను చక్కబెట్టడానికి మంత్రి అవంతి శ్రీనివాస్.. రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విష వాయువుల ప్రభావానికి గురైన గ్రామంలో నిద్రించారు. ఆ మరుసటి రోజే గ్రామంలో తిరిగుతూ, మూగ జీవాలకు గడ్డి వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను pic.twitter.com/Pp2XQwrKfL
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020
ఆ ఫొటోలను ఆధారంగా చేసుకుని తాజాగా నాగేంద్రబాబు అవంతి శ్రీనివాస్పై సెటైర్లు వేశారు. అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను.. అనే కామెంట్ను జత చేశారు. అవంతి శ్రీనివాస్ను మాత్రమే టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. అవంతి శ్రీనివాస్ రాజకీయ అరంగేట్రం చేసింది.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచే. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా భీమిలీ నుంచి పోటీ చేసిన విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకుని కూడా అవంతి శ్రీనివాస్ గెలిచారు.
అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంతో అవంతి కూడా కాంగ్రెస్లో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో భీమిలీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
Recommended Video
అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఎదిగిన క్రమాన్ని ఉద్దేశించి తాజాగా నాగేంద్రబాబు సెటైర్లు సంధించినట్లు చెబుతున్నారు. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్లే ఎదిగిన అవంతి శ్రీనివాస్ తమ పార్టీకి అండగా లేకుండా పోయారనే ఉద్దేశంతో నాగేంద్రబాబు ఆయనను టార్గెట్గా చేసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపుతాయనేది ఆసక్తికరంగా మారింది.