నాగర్ కర్నూలు సీటు: మందాకు నల్లేరు మీద నడకే?
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు లోకసభ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మందా జగన్నాథం విజయం నల్లేరు మీద నడకగా మారింది. అనూహ్యమైన సంఘటనలు జరిగితే తప్ప ఆయన విజయాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదనే విశ్లేషణలు సాగుతున్నాయి. మందా జగన్నాథం గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని రెండు సీట్లలో నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నంది ఎల్లయ్య అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయగా, తెలుగుదేశం బక్కని నరసింహులుకు టిక్కెట్ ఇచ్చింది. వరుసగా నాల్గవ సారి తన గెలుపు ఖాయమనే ధీమాలో మంధా జగన్నాథం ఉన్నారు.
నంది ఎల్లయ్య కూడా కాంగ్రెస్లో సీనియర్ నేతనే. కాని జగన్నాథం నియోజకవర్గంలో పాతుకుపోయారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చారు. 1999 నుంచి జగన్నాథం నాగర్కర్నూలు సీటు నుంచి గెలుస్తున్నారు. 2004లో టిడిపి నుంచి ఎన్నికైన జగన్నాథం, యుపిఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచిన తర్వాత తెరాసలోకి వెళ్లారు.
ఇటీవల కాలంలో టిడిపి ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నాగం జనార్దన్ రెడ్డి తెరాస, బిజెపిల్లోకి మారడంతో తెలుగుదేశం బలహీనపడింది. నాగర్కర్నూలు లోక్సభ సీటులో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి డికె అరుణ పోటీ చేస్తున్నారు. డికె అరుణ ఏడు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించేందుకు, ఎంపి సీటుకు పోటీ చేస్తున్న నంది ఎల్లయ్యను నెగ్గించేందుకు విశేషంగా ప్రచారం చేస్తున్నారు.