దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విచారణ తప్పుదోవ పట్టిస్తున్నారు: రోజా
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
ఆదివారం నాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారని రోజా ఆరోపించారు. వార్డు మెంబర్గా కూడ గెలవని లోకేష్ కోసం చంద్రబాబునాయుడు దేవాలయాలను అప్రతిష్టపాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు.
వనజాక్షి, పుష్కరాలలో తొక్కిసలాటలో విచారణ మాదిరిగానే దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహరాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఈవోపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు.
దుర్గ గుడిలోనే కాదు, ఇతర దేవాలయాల్లో కూడ హిందూ సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబునాయుడుకు దేవుడే తగిన శిక్ష వేస్తాడని రోజా అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాసంకల్పయాత్ర ముందుకు కొనసాగిస్తుంటే, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పోలీసుల సహకారంతో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా వారిని బలవంతం చేసి జన్మభూమికి తరలిస్తున్నారని రోజా చెప్పారు.