రోజాకు రాజకీయ ఇబ్బందులు: శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటుతో: జగన్ దృష్టికి
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.
రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు..
కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోంది కొన్ని చోట్ల. ప్రత్యేకించి- రాయలసీమలోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉంటూ వస్తోన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత చెలరేగిన విషయం తెలిసిందే.
మదనపల్లి, తంబళ్లపల్లి ప్రజల సౌకర్యం కోసమే..
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులే తప్పుపడుతున్నారు. రాజంపేటకు చెందిన వైసీపీ నాయకులు తమ పదవులకు సైతం రాజీనామాలు చేయడానికి వెనుకాడట్లేదు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే- దీన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తోన్నారు. మదనపల్లి, తంబళ్లపల్లి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని- మధ్యలో ఉన్న రాయచోటిని ప్రభుత్వం జిల్లా కేంద్రంగా చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదు. నిరసన ప్రదర్శనలకు పూనుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలోనూ..
అటు చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. నగరి నియోజకవర్గాన్ని చిత్తూరులో కొనసాగింపజేయడాన్ని అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తోన్నారు. నగరిని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలంటూ వారు డిమాండ్ చేస్తోన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకుని శ్రీబాలాజీ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరిని దీని పరిధిలోకి చేర్చింది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలతో చిత్తూరు జిల్లా కొనసాగుతుంది.
అనాలోచిత చర్యగా..
తొందరబాటుగా, అనాలోచితంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని నగరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం సుదీర్ఘ కాలం నుంచి తిరుపతి మీద ఆధారపడి ఉందని, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం నగరి ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా నగరి ప్రజలు వెళ్లేది అక్కడికేనని చెప్పారు. ప్రజల రోజువారీ అవసరాలను పట్టించుకోకుండా.. వారి సౌకర్యం గురించి ఆలోచించకుండా ప్రభుత్వం చిత్తూరుజిల్లాను విభజించిందని విమర్శించారు.
చిత్తూరుకు వెళ్లడం ఇబ్బంది..
తమ నియోజకవర్గానికి దూరంగా ఉన్న చిత్తూరుకు నగరి ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం ఇబ్బందికరమని అన్నారు. చిత్తూరు జిల్లాను రెండుగా విభజించడంలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయలేకపోయిందని పేర్కొన్నారు. ఏదైనా ఒక జిల్లాను కొత్తగా ఏర్పాటు చేస్తే.. దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలే తప్ప..కొత్త వాటిని సృష్టించేలా ఉండకూడదని గాలి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమిళనాడు మీదుగా ప్రయాణం..
నగరి ప్రజలు చిత్తూరుకు తమిళనాడు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పుంగనూరును చిత్తూరు జిల్లాలో విలీనం చేసిన తరహాలోనే- తమ నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రకారం చూసుకుంటే సర్వేపల్లి శ్రీబాలాజీ జిల్లా పరిధిలోకి రావాలని, అయినప్పటికీ దాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వం నోటిఫికేషన్లో సవరణలు చేసిందని గుర్తు చేశారు.
శ్రీబాలాజీ జిల్లాలో విలీనం..
అలాంటప్పుడు తమ డిమాండ్కు అనుగుణంగా నగరి నియోజకవర్గాన్ని కూడా శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయడం తప్పు కాదని అన్నారు. ఒక్క కార్వేటి నగరం మినహా.. నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీ పురం, ఏర్పేడు, రేణిగుంట అన్నీ తిరుపతి పరిధిలోకి వచ్చే మండలాలేనని పేర్కొన్నారు. నగరి ప్రజల అభిప్రాయాలను తాము ప్రభుత్వానికి వినిపిస్తామని అన్నారు. ఈ నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Recommended Video
రోజాకు రాజకీయ ఇబ్బందులు..
ఈ పరిణామాలు స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాకు రాజకీయంగా ఇబ్బందులను కలిగించినట్టయింది. నగరిని శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్ పట్ల ఆమె ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ఆమె వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తారా? లేక ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్కు విన్నవిస్తారా అనేది తేలాల్సి ఉంది. నగరిని చిత్తూరు జిల్లాలో కొనసాగింపజేయడానికే రోజా మొగ్గు చూపారని అంటున్నారు.