మోడీని కలవనున్ననాగార్జున: అమల పొలిటికల్ ఎంట్రీ?
హైదరాబాద్/అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా మన రాష్ట్రంలోను కనిపిస్తోంది. ఇప్పటికే మోడీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇప్పుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున భేటీ కానున్నారు.
మోడీతో భేటీ కోసం ఆయన అహ్మదాబాద్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆయన మోడీతో భేటీ అయ్యే అవకాశముంది. గత ఏడాది ఆగస్టులో మోడీ హైదరాబాదుకు వచ్చినప్పుడు సినీ, పారిశ్రామిక ముఖ్యులు ఆయన వద్దకు క్యూ కట్టారు.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు మోడీ పట్ల ఆకర్షితులవుతున్నారు. మొన్న శుక్రవారం పవన్, నేడు నాగార్జున మోడీతో కలుస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి నాగార్జున మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
అమల కోసమేనా?
బిజెపి, మోడీ వైపు ఆకర్షితులైన నాగార్జున తన సతీమణి అమల కోసం కూడా అహ్మదాబాద్ బయలుదేరి ఉంటారంటున్నారు. ఈ ఎన్నికల్లో అమల రాజకీయ ఆరంగేట్రం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆమె విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారంటున్నారు. మోడీకి మద్దతు పలికి అదే సమయంలో తన సతీమణి అమలకు విజయవాడ స్థానం ఖరారు చేయించుకనే అవకాశాలు లేకపోలేదంటున్నారు.