‘కమీషన్ల కోసం చంద్రబాబు-కేపీఎంజీలో లోకేష్, సోమిరెడ్డి’
విజయవాడ: ఏపీ మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కన్సల్టెన్సీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వ్యవసాయ శాఖ, కేపీఎంజీ ఏజెన్సీని కన్సల్టంట్గా నియమించిందని, రైతులకు కనీసం సలహాలు, సూచనలు ఇవ్వలేని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారంటూ నిలదీశారు.
దోచుకోవడం అలవాటైపోయింది
చంద్రబాబుకు దోచుకోవడం అలవాటైపోయిందని, గతంలో ఇదే విధంగా మెకన్సీ సంస్థకు ఇలాగే ఇచ్చారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఏళ్ల అనుభవం ఉన్న శాష్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉండగా ఏజెన్సీలకు కట్టబెట్టడం దారుణమని, కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు ఈ పనులకు పూనుకున్నారని విమర్శించారు.
సోమిరెడ్డిక బాబు భజన తప్ప..
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కానీ చంద్రబాబు పాలనలో దండుగలా మారిందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడూ బాబు భజన చేసే మంత్రి సోమిరెడ్డి రైతు సమస్యల గురించి ఎప్పుడైనా చర్చించారా? అని నిలదీశారు.
స్వప్రయోజనాలే ముఖ్యం
దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అందాల్సిన మద్దతు ధర గురించి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, సోమిరెడ్డిలకు రైతు ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏం చేశారని నాగిరెడ్డి నిలదీశారు.
కేపీఎంజీలో లోకేష్, సోమిరెడ్డి
బాబు ఇప్పటికైనా స్వప్రయోజనాలు విడిచిపెట్టి, రైతుల కోసం కృషి చేయాలని నాగిరెడ్డి హితవు పలికారు. కేపీఎంజీ స్కాం చరిత్ర బయటకు తీస్తే లోకేష్, సోమిరెడ్డి పేర్లు బయటికి వస్తాయని నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ధి రేటు బాగుందని చంద్రబాబు ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని, అంత బాగుంటే అంతర్జాతీయ కన్సల్టెన్సీల అవసరం ఎందుకని నిలదీశారు.