దక్షిణాది రాష్ట్రాల సొమ్ముతో ఉత్తరాదికి సోకులు: కేంద్రంపై చంద్రబాబు ధ్వజం
అమరావతి: దక్షిణాది రాష్ట్రాల పన్నులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 'మీరు అభివృద్ధి చెందుతున్నారు.. కానీ ఏపీకి సహాయం చేయకపోవడం సరికాదు..' అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శానసమండలిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రానికి దక్షిణ భారత దేశం నుంచి పన్నుల రూపంలో ఎక్కువగా డబ్బు వెళుతోందని చంద్రబాబునాయుడు తెలిపారు. అయితే కేంద్రం మాత్రం ఆ డబ్బును ఉత్తర భారతదేశానికే అధికంగా ఖర్చు చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ కూడా కాంగ్రెస్లాగే చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు.
రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు...
రాష్ట్ర విభజన జరిగిన తీరే బాధాకరం అని ప్రతి ఒక్కరూ భావిస్తోంటే.. కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం మరింత బాధ కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదని, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీ కూడా కాంగ్రెస్లాగే చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు.
వెనుదిరిగే సమస్యే లేదు...
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 18 హామీలను అమలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ‘హక్కుల కోసం పోరాడతాం. రాజీ పడేది లేదు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ సాధించేదాకా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఎంతవరకైనా వెళతాం..' అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన దునుమాడారు.
సెంటిమెంట్తో రాష్ట్రం ఇవ్వలేదా?
‘సెంటిమెంట్తో నిధులు రావు..' అన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. ‘ఏం.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఇచ్చితీరాల్సిందే..' అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారని, అందుకే కేంద్రం నుంచి వైదొలగామని చంద్రబాబు పేర్కొన్నారు. తాము కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నా ఎన్డీయేలో ఉన్నామని అన్నారు. తమ నాయకుడు ఎన్టీ రామారావు ఆంధ్రులకు ఆత్మగౌరవమిస్తే, తాను ఆత్మ విశ్వాసం ఇస్తున్నట్లు చెప్పారు.
చట్టాన్ని గౌరవించాలి, హామీలు నిలబెట్టుకోవాలి...
కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ గతంలో చెప్పిన మాటలే చెబుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారని, అలాంటప్పుడు ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టం చేయడాన్ని కూడా బాబు పేర్కొన్నారు. కేంద్రం చట్టాలను గౌరవించాలి, హామీలను నిలబెట్టుకోవాలని బాబు సూచించారు.
బీజేపీ ఎదురుదాడి సరికాదు...
ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి మీరే వెక్కిరిస్తే ఎలా? అని బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సిమెంట్ రోడ్లకు ‘మా డబ్బులు ఇచ్చాం..' అంటున్నారు. మా డబ్బులు, మీ డబ్బులు అంటూ ఏవీ ఉండవు. అన్నీ ప్రజలు ఇచ్చిన డబ్బులే..' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దక్షిణాది రాష్ట్రాల పన్నులే ఎక్కువ...
దక్షిణాది నుంచి వసూలయ్యే పన్నులే ఎక్కువని, కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు పన్నులు కడితే 42 శాతం వాటా రాష్ట్రానికి ఇస్తారని, కేంద్రం 58 శాతం పెట్టుకుంటుందని తెలిపారు. ఏపీలో జాతీయ రహదారులు వేస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. కానీ... అవన్నీ పీపీపీ పద్ధతిలో వస్తున్నవేనని ఆయన ఎందుకు చెప్పరు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని లోపాలవల్ల ఎంతో నష్టపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి రావాల్సిన ఆదాయం కూడా తెలంగాణకు వెళ్తోందని, కృష్ణపట్నం పోర్టు వల్ల కూడా ఆదాయం కోల్పోతున్నాం అని పేర్కొన్నారు.
తెలుగు వారి సత్తా ఏమిటో నిరూపిద్దాం...
తిరుపతి సభలో మోడీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించింది..' అని వ్యాఖ్యానించారని, ఇప్పుడ ఆ తల్లిని కాపాడాలనే తాము విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు యూసీలు కేంద్రానికి పంపామని, వాటిని నీతి ఆయోగ్ కూడా ధ్రువీకరించిందని అన్నారు. ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నామని, అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని, తెలుగు వారి సత్తా ఏమిటో నిరూపిద్దామని బాబు పిలుపునిచ్చారు.