జగన్ పై సోషల్ పోస్టు- నెల్లూరు కార్యకర్తకు పోలీసు కాల్స్- ఆ తర్వాత చంద్రబాబు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టుల పర్వం కొనసాగుతోంది. ఇందులో టీడీపీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటున్న కొందరు వ్యక్తులు యాక్టివ్ గా ఉంటున్నారు. వీరిపై సీఐడీ నిఘా కూడా అదే స్ధాయిలో ఉంటోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి నోటీసులు వెళ్లడం, విచారణ సాగడం జరుగుతూనే ఉంది.
తాజాగా నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్స్ చేసి శ్రీకాంత్ రెడ్డిని విచారించారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడంపై ఆరా తీశారు. తరచూ పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో దీనిపై తన ఆవేదనను ఆడియో రూపంలో తిరిగి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేశాడు. ఇది టీడీపీ నేతలకు చేరడంతో వారు అధినేత చంద్రబాబుకు విషయం వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు.
నేరుగా చంద్రబాబు నుంచే ఫోన్ కాల్ రావడంతో శ్రీకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. నేనే తప్పూ చేయలేదని, బెదిరింపులకు లొంగబోనని, చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సిద్దమని చంద్రబాబుకు తెలిపాడు. దీంతో చంద్రబాబు కూడా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా తన అభిప్రాయాన్ని ఆడియో రూపంలో బయటపెట్టిన శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి ధైర్యం చెప్పారు.