రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్స్ను ఎత్తి చూపండి: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
అమరావతి: రాజకీయాల ముసుగులో ఉన్న క్రిమినల్స్, అవినీతిపరుల వివరాలను ప్రజలకు వివరించాలని టీడీపీ కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్న్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకుకెళుతుంటే, కొన్ని శక్తులు మాత్రం దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కుల విభేదాలు సృష్టించి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
ప్రతిపక్షానికి సమస్యలేనట్టు కులాల మధ్య చిచ్చు పెట్టి, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబు సుమారు 8,000 మంది పార్టీ కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కులం, మతం లాంటి సున్నితమైన విషయాలను రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష నేతల వైఖరిని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు ఏపీలో ఉన్న సంక్షోభాన్ని, ఆటంకాలను అధిగమించి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి ప్రచారం రూపంలో తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పథకం అమలుకు రాష్ట్రంలో రూ. 3,500 కోట్లు వ్యయం చేశామని...ఈ ఏడాది చివరికల్లా 6,500 కోట్ల వరకూ వ్యయం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీసీలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉందనే విషయాన్ని కార్యకర్తలు తెలియజేయాలని సూచించారు. పేదరికం, ఆర్ధిక అసమానతలను పొగొట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు.
ఉపాధి హామీ కింద 60 శాతం శ్రామిక శక్తిని వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ ఉపయోగిస్తున్నామన్నారు. పంటల దిగుబడి పెంచటానికి అత్యుత్తమ పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు. రాయలసీమను ఉద్యానవన పంటలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.