రెండువైపులా ఒత్తిడి: ‘అతడే ఒక సైన్యం’ కాలేకపోతున్న చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండ్రోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి రోడ్డెక్కుందుకు తాను సిద్ధం కానున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. అంతేగాక, కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా, రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బినామీల పేరుతో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందలాది ఎకరాలను కాజేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా పలు కథనాలతో విరుచుకుపడుతోంది.
Picture Of The Day ; ఈ రోజు కార్టూన్
ఈ నేపథ్యంలో ఎప్పుడూ అన్నీతానై ప్రతిపక్షాలకు ధీటుగా జవాబు చెబుతూ.. అభివృద్ధి పనులు చేసుకుంటూ దూసుకుపోయే చంద్రబాబు.. తొలిసారి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది.
ఇటీవల మంత్రులు, నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానమివ్వాలని వారికి సూచించారు.
ఈ నేపథ్యంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా ఆరోపణలపై మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, రావెల కిశోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము భూములు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
బినామీ పేర్లతో తాము భూములు కొన్నట్లు రుజువు చేస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ మంత్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేగాక, ఆ భూములను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకే రాసిస్తామని అన్నారు.
మరోవైపు కాపు వర్గానికి చెందిన మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, గంటా శ్రీనివాస్ రావు, కొల్లు రవీంద్రలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై విరుచుకుపడ్డారు. కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో లేరని ఆరోపిస్తూ బుధవారం ముద్రగడ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ఖచ్చితమైన హామీ ఇస్తేనే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించినట్లు తెలిపారు.
చంద్రబాబు ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల అంశంపై వెనక్కితగ్గేలా కనిస్తోందని, ఈ నేపథ్యంలో తాను మరోసారి రోడ్డుపైకి వస్తానని స్పష్టం చేశారు. కాగా, కాపు వర్గానికి ఒక్క ముద్రగడ పద్మనాభమే నాయకుడు కాదని కాపు మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు. తమది కాపు అనుకూలమైన ప్రభుత్వమని, ప్రభుత్వంలో ఆరుగురు కాపు మంత్రులు, చాలా మంది కాపు ఎమ్మెల్యే కూడా ఉన్నారని స్పష్టం చేశారు. టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు కాపు వర్గానికి అనుకూలంగా ఉన్నారని అన్నారు.