అసెంబ్లీని ఆక్రమించేస్తున్న చంద్రబాబు- తన వాయిస్ జనంలోకి వెళ్లట్లేదని జగన్ గగ్గోలు...
గతేడాది వైసీపీ అధికారలోకి వచ్చిన నాటి నుంచి గమనిస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం హడావిడి ఎక్కువగా కనిపించేది. ఏ బిల్లు పెట్టాలన్నా, తిరస్కరించారన్నా, విపక్షాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న పరిస్ధితి. కానీ ఈ సారి సమావేశాల్లో మాత్రం భిన్నమైన పరిస్ధితి కనిపిస్తోంది. కేవలం 23 మంది సభ్యులే కలిగిన విపక్షాన్ని అడ్డుకునేందుకు అధికార వైసీపీ అపసోపాలు పడుతోంది.. అలాగని సభలో ఎక్కువ సమయం విపక్షానికి దొరుకుతుందా అంటే అదీలేదు. తమకు అందుబాటులో ఎక్కువ సమయం ఉన్నప్పటికీ తమ వాదన మాత్రం జనంలోకి వెళ్లడం లేదని వైసీపీ గగ్గోలు పెడుతోంది.
ఏపీ అసెంబ్లీలో మారిన పరిస్ధితి...
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది సభ్యులుంటే టీడీపీకి కేవలం 23 మంది ఉన్నారు. అందులోనూ నలుగురు టీడీపీ సభ్యులు వైసీపీకే మద్దతిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ అన్నివిధాలుగానూ ఆధిక్యం చెలాయిస్తుందని అంతా భావిస్తారు. కానీ అందుకు భిన్నమైన పరిస్ధితి ఈసారి కనిపిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఆధిపత్యం ప్రదర్శించినా ఈసారి మాత్రం ఎందుకో తడబడుతోంది. దీంతో కేవలం 19 మంది సభ్యులతోనే టీడీపీ చేస్తున్న పోరాటం వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా కీలకమైన రైతు సమస్యలు, పోలవరం వంటి విషయాల్లో చర్చను గమనిస్తే వైసీపీ కంటే టీడీపీ ఆధిపత్యం స్ఫష్టమవుతోంది.
చంద్రబాబు అంతా తానే....
వైసీపీకి చేజేతులా అధికారాన్ని అప్పగించామన్న బాధో, ఘోర పరాజయం తెచ్చిన కష్టమో తెలియదు కానీ ఏడాది కాలంగా జరిగిన పలు అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత చంద్రబాబు గతంతో పోలిస్తే చాలా డల్గా కనిపించారు. కీలకమైన అంశాలపైనా తాను గొంతు విప్పితే అధికారపక్షం అడ్డుకుంటుందన్న ఆలోచనతో అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్ నేతలతో మాట్లాడించేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు వారు మాట్లాడుతున్న సందర్భంలోనూ తనకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను అడిగి మరీ చెలరిగేపోతున్నారు. దీంతో అధికార వైసీపీ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది.
ప్రతీ ప్రశ్నకూ సమాధానం జగనే...
వాస్తవానికి అసెంబ్లీలో విపక్షం తరఫున అడిగే ప్రశ్నలకు ప్రతిసారీ సభానాయకుడైన ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత మంత్రి కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ సమాధానం చెప్పేందుకు స్పీకర్ అనుమతిస్తుంటారు. చాలా సందర్భాల్లో అధికార పార్టీలోని సీనియర్ నేతలే విపక్షాలకు సమాధానం చెబుతుంటారు. కానీ ఈసారి పరిస్ధితి భిన్నంగా కనిపిస్తోంది. విపక్ష టీడీపీ తరఫున సంధిస్తున్ ప్రశ్నలకు నేరుగా సీఎం జగన్ ప్రతీసారీ సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతీసారీ జగనే ఎందుకన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. విపక్షానికి కౌంటర్ ఇచ్చేందుకు గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు జగనే ముందుకొచ్చేవారు. ఇప్పుడు సీఎంగా కూడా ఆయనే సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపుతుండటం వైసీపీలో ఇంకెవరూ లేరా అన్న ప్రశ్నకు కారణమవుతోంది.
Recommended Video
విపక్ష నేతగానే ఫీలవుతున్న జగన్...
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ విపక్ష నేతగా ఉండే వారు. వైసీపీ తరపున ప్రభుత్వానికి ప్రశ్నలన్నీ ఆయనే వేసేవారు. మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వొచ్చుగా అంటూ అప్పటి శాసనసభా వ్యవహారాలమంత్రి యనమల జగన్కు సూచించేవారు. అప్పట్లో తన వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని జగన్ ఆరోపించేవారు. అయినా టీడీపీ లెక్కచేయలేదు. కానీ ఇప్పుడు కూడా జగన్ అదే వాదన వినపిస్తున్నారు. విపక్ష నేత చంద్రబాబు తన వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు సీఎం జగన్ నుంచి పదే పదే వినిపిస్తున్నాయి. దీంతో సీఎం వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే శక్తి నిజంగానే విపక్షానికీ, విపక్ష నేతకు ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం జగన్ ఇంకా ప్రతిపక్ష నేతగానే భావిస్తుండటమే అన్న వాదన వినిపిస్తోంది.