కొత్త రాజధానులకు నిధులా- జగన్కు కామన్సెన్స్ లేదన్న చంద్రబాబు- ఎలా ఇస్తారంటూ ప్రశ్న..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రైతుల త్యాగాలతో ఏర్పాటైన అమరావతిని కాదని కొత్త రాజధానులను ఏర్పాటు చేసే హక్కు జగన్ సర్కారుకు లేదన్నారు. అమరావతికి కోసం లక్ష కోట్లు అవుతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మూడు రాజధానులకు పది లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని ఎలా కోరతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ చర్యలకు భావి తరాలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అందుకే అమరావతి సమస్య ఏ ఒక్కరిదో అనుకోవద్దన్నారు.
అమరావతి అందుకే ఎంచుకున్నాం..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే అమరావతిలో రాజధాని పెట్టామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పరిశీలించిన తర్వాత అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటూ అందుబాటులో ఉంటుందనే ఇక్కడ రాజధాని నిర్మాణం ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు రాజధాని తరలించి భావితరాలకు అన్యాయం చేయొద్దని జగన్ సర్కారుకు చంద్రబాబు సూచించారు. రాజధాని తరలింపు ప్రయత్నాలపై ఆయన మరోసారి మండిపడ్డారు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా సెల్ఫ్ పైనాన్స్ విధానంలో అమరావతి నిర్మిస్తే భవిష్యత్తులో 2.5 లక్షల కోట్ల సంపద సృష్టించే అవకాశముందన్నారు.
భవనాలు ఎలా అమ్ముతారు ?
రైతులు రాజధాని కోసం అమరావతిలో ఇచ్చిన భూముల్లో నిర్మించిన భవనాలను వైసీపీ ప్రభుత్వం ఎలా అమ్మకానికి పెడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు రాజధాని కోసం భూములిచ్చారని, ప్రభుత్వం భవనాలు కట్టి అమ్ముకోవడానికి కాదన్నారు. ఇది కచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే అన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. అమరావతిలో నిర్మాణాలు గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు మేం కట్టిన భవనాలను ఎలా అమ్ముతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అంటే గతంలో వైసీపీ చెప్పిన మాటలన్నీ అబద్దాలే అని దీంతో స్పష్టమవుతుందన్నారు.
కేంద్రం డబ్బులిస్తుందా ?
అమరావతి రాజధానికి డబ్బులిచ్చిన కేంద్రానికి ఇప్పుడు తరలిపోకుండా చూసే బాధ్యత కూడా ఉందని చంద్రబాబు అన్నారు. ఉన్న రాజధానిని వదిలిపెట్టి కొత్త రాజధానులు కడతామంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి రాజధానిని లక్ష కోట్ల ఖర్చు పేరుతో తరలిస్తూ ఇప్పుడు మూడు రాజధానుల కోసం ఆర్ధిక సంఘానికి 10 లక్షల కోట్లు కోరడంలో ఔచిత్యమేంటని టీడీపీ అధినేత సూటిగా ప్రశ్నించారు. అసలు రాజధానులకు ఈసారి కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది, వైసీపీ ప్రభుత్వానిక ఆ మాత్రం కామన్సెన్స్ లేదా అని చంద్రబాబు ఆక్షేపించారు. ఇదో పిచ్చి తుగ్లక్ చర్య అని చంద్రబాబు స్పష్టం చేశారు. మన సంపద సర్వనాశనం చేసుకుని కేంద్రాన్ని డబ్బులు అడుగుతారా, బీద అరుపులు అరిస్తే ఎవరూడబ్బులిచ్చే పరిస్దితిలేదని ఆయన తెలిపారు.
ప్రజా తీర్పు కోరాల్సిందే...
ఆమరావతి నుంచి రాజధాని తరలింపుపై కచ్చితంగా ప్రజాతీర్పు కోరాల్సిందేనని చంద్రబాబు మరోసారి డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఓసారి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని అడిగామని, కానీ ఇందుకు ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిస్తే తాము అమరావతి పోరాటం వదిలేస్తామన్నారు. కానీ ప్రజలను మోసం చేసి ముందుకెళతామంటే ఊరుకునే ప్రశ్నే లేదన్నారు. రాజధాని రైతులపై, టీడీపీపై కక్ష తీర్చుకునేందుకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. అమరావతి రాజధాని తరలింపు ఏ ఒక్కరి సమస్యా కాదన్నారు. అందరి సమస్యగా భావించాల్సిందేనని టీడీపీ అధినేత తెలిపారు.