అమరావతి ఉద్యమంలోకి బీటెక్ రవి- ఒకేసారి జగన్, పవన్ ను టార్గెట్ చేసే వ్యూహం..
నిన్న మొన్నటి వరకూ చప్పగా సాగిన అమరావతి ఉద్యమంలోకి అనూహ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వచ్చి చేరారు. అదీ చట్ట సభలకు గౌరవం ఇవ్వకుండా మండలి వద్దన్న మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించినందుకు నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చారు. వాస్తవానికి గతంలో బీటెక్ రవి ఈ ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ తాజాగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్దితుల నేపథ్యంలో బీటెక్ రవిని రంగంలోకి దించడం ద్వారా టీడీపీ బహుళ ప్రయోజనాలను ఆశిస్తోంది.
సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..
అమరావతికీ బీటెక్ రవికీ సంబంధమేంటి ?
ఎక్కడ అమరావతి, ఎక్కడ కడప, ఎక్కడ టీడీపీ... సీన్ కట్ చేస్తే అమరావతి ఉద్యమంలోకి కడప నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్ రవి ఎంట్రీ. టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, దాదాపు పాతిక మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నా కేవలం ఈ ప్రాంతానికి కూడా సంబంధం లేని బీటెక్ రవి ఏ ప్రయోజనం ఆశించి అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. అదీ తన ఎమ్మెల్సీ పదవి వదులుకుని మరీ. ఇప్పుడు అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మార్క్ రాజకీయానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాల్సిన పరిస్ధితి.
అమరావతికి రప్పించిన బీటెక్ రవి నేపథ్యం...
కడప జిల్లా పులివెందులకు చెందిన బీటెక్ రవి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిపై చంద్రబాబు రంగంలోకి దించి గెలిపించుకున్న ఎమ్మెల్సీ ఆయన. సొంతగడ్డపై వైఎస్ కుటుంబానికి చాలా కాలం తర్వాత ఓ పరాజయం రుచి చూపించిన ఘనుడు బీటెక్ రవి. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మూడు రాజధానులను వ్యతిరేకించేందుకు టీడీపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలు జంకుతున్న వేళ.. అదీ జగన్ కుటుంబంపై వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్సీని రంగంలోకి దింపడం ద్వారా ఇతర ప్రాంతాల్లోనూ జగన్ నిర్ణయంపై వ్యతిరేకత ఉందని చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
జగన్, పవన్ పై రాజీనామాస్త్రం...
ఏపీలో ప్రస్తుతం రాజీనామాల డిమాండ్ కాక రేపుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే... మేం ఒక్కరమే ఎందుకు మొత్తం అసెంబ్లీనే రద్జు చేయండి అందరూ మళ్లీ ప్రజాతీర్పు కోరదాం అంటూ చంద్రబాబు తాజా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవి అమరావతిలో అడుగుపెట్టారు. వచ్చీ రాగానే సీఎం జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ నూ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. టీడీపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరుతున్న పవన్ ముందు తన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ కూడా అమరావతిపై ప్రజా తీర్పు కోరాలన్నారు. తద్వారా రాజీనామా చేసి వచ్చిన ప్రజాప్రతినిధిగా జగన్, పవన్ ఇద్దరినీ తమ ఎమ్మెల్యేలను రాజీనామా దిశగా నడిపించాలని సహేతుకమైన డిమాండ్ చేసినట్లయింది.
Recommended Video
సీఎం జగన్ నేపథ్యంతో టార్గెట్...
కడప జిల్లా పులివెందులకు చెందిన బీటెక్ రవికి వైఎస్ కుటుంబానికి చెందిన మూడు తరాల గురించి అవగాహన ఉంది. రాజారెడ్డితో మొదలుకుని జగన్ వరకూ ఆ కుటుంబం ఎదిగిన తీరు, రాజకీయాలు, ఫ్యాక్షన్, చివరికి వివేకా హత్య గురించి కూడా పూర్తిగా తెలుసు. కాబట్టి అమరావతి ఉద్యమంలో ఆయా వ్యవహారాలను రోజూ ప్రస్తావించడం ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకురావచ్చని, ఇక్కడి రైతులకు తెలియని అంశాలను బీటెక్ రవి ద్వారా చెప్పించాలనేది చంద్రబాబు వ్యూహం. నేరుగా సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బీటెక్ రవి మాట్లాడటం మొదలుపెడితే రేపు అవే అంశాలు రైతులు కూడా ప్రస్తావిస్తారు. అప్పుడు జగన్ ఇరుకున పడటం ఖాయం. అందుకే బీటెక్ రవిని ఒప్పించి మరీ రాజీనామా ప్రకటన చేయించి అమరావతి ఉద్యమంలోకి దింపినట్లు తెలుస్తోంది.