జగన్ స్టిక్కర్ సీఎం అన్న చంద్రబాబు- మీకు నరకంలో కూడా చోటుండదన్న జగన్
ఏపీలో ఇళ్ల స్ధలాలకు సంబంధించి ఇవాళ జరిగిన చర్చ టీడీపీ, వైసీపీ మధ్య మరో మాటల యుద్ధానికి దారి తీసింది. ఏపీలో ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసింది తానేనని, ఇళ్లు కట్టించింది కూడా తానేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పేదల ఇళ్ల స్ధలాల పంపిణీ, టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. గతంలో వైఎస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.4500 కోట్ల అవినీతి జరిగిందని తన ప్రభుత్వం జరిపించిన విచారణలో తేలిందన్నారు. అప్పట్లో తన తండ్రి వైఎస్ కట్టించిన ఇళ్లను ఇప్పుడు చూపించాలని సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. పేదవాడు గుడిసెలో ఉండాలి, జగన్కు మాత్రం ప్యాలెస్కు కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
తాను కట్టించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ఇస్తామనడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతీ ఒక్క దానికీ మీ పేరు పెట్టుకోండి, బాధలేదంటూ విమర్శించారు. మీరు స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతారంటూ జగన్ను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వైఎస్ హయాంలో సేకరించిన భూముల్లోనే మీరు ఇళ్లు కట్టారంటూ చంద్రబాబుకు మంత్రి కన్నబాబు చురకలు అంటించారు. ఎవరి పేరు ఎవరు వాడుకుంటున్నారో టీడీపీ చెప్పకూడదని, ఎన్టీఆర్ నుంచి పార్టీని, పార్టీ గుర్తును లాక్కొన్న చరిత్ర చంద్రబాబుదని కన్నబాబు గుర్తుచేశారు.
ఆ తర్వాత మాట్లాడిన సీఎం జగన్ తన పాదయాత్రతో పాటు మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాలను గుర్తుచేశారు. అవసరమైతే సభలో పాదయాత్రలో తాను మాట్లాడిన మాటల వీడియో కూడా ప్రదర్శిస్తామన్నారు. చంద్రబాబుకు కళ్లు కనిపించడం లేదన్నారు. కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు నరకంలో కూడా చోటు ఉండదని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తాను టీడీపీ మ్యానిఫెస్టో గురించి చెబితే జగన్ వైసీపీ మ్యానిఫెస్టో గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. జగన్కు చెవులు వినిపించడం లేదన్నారు.