సుప్రీం తీర్పును అలా వాడేసుకుంటున్న చంద్రబాబు- డర్టీ పాలిటిక్స్ వద్దంటూ ట్వీట్...
ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చేందుకు ఏ ఒక్క అవకాశం దక్కినా వదులుకునే పరిస్ధితి కనిపించడం లేదు. రోజువారీ విమర్శలతో పాటు కోర్టు తీర్పులను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇదే కోవలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి నిర్వహణ, హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాన్ని ఏపీ రాజకీయాలకు లింక్ చేస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..
కేరళలోని అనంత పద్మనాభస్వామి గుడి నిర్వహణ, ఇతర హక్కులు కూడా వారసత్వంగా ఈ వ్యవహారాలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును స్వాగతించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ దీన్నో గుణపాఠంగా తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. రాజకుటుంబాలు ఆయా ట్రస్టుల నిర్వహణ కోసం గతంలో చేసుకున్న ఒప్పందాలు, ఇతర వారసత్వ హక్కులను గౌరవించి ప్రభుత్వాలు నడుచుకోవాలని ఈ తీర్పు సూచిస్తోందన్నారు. రాజ కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదంటూ ఏపీలోని మాన్సాస్ ట్రస్టును లింక్ చేశారు. ఈ తీర్పు నుంచి ప్రేరణ పొంది మాన్సాస్ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలని, డర్టీ పాలిటిక్స్ చేయొద్దంటూ జగన్ సర్కారుకు చంద్రబాబు సూచించారు.
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా గతంలో పనిచేసిన టీడీపీ నేత అశోక్ గజపతిరాజును వైసీపీ సర్కారు తప్పించి ఆయన స్ధానంలో ఆయన అన్నకూతురు సంచయితను కూర్చోబెట్టింది. ఇందుకోసం రాత్రికి రాత్రే రహస్య జీవోలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అశోక్ ఈ వ్యవహారాన్ని కోర్టుల్లో సవాల్ చేశారు. సివిల్ వివాదం కావడంతో విచారణ కూడా వాయిదా పడుతోంది.