బాబుపై పోటీనా? కార్పొరేటర్గా గెలుస్తావా?: విజయసాయికి నక్కా సవాల్, ‘రోజా పార్ట్టైమ్ ఎమ్మెల్యే’
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాలి గోటికి కూడా విజయసాయి సరిపోడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి.. సన్యాసం తీసుకుంటా
శుక్రవారం నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డికి దమ్ముంటే విశాఖలో కార్పొరేటర్గా పోటీ చేసి గెలవాలని, ఒక వేళ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు.
కేంద్రం విఫలం
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ హక్కుల గురించి ఆనంద్ బాబు ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో సమగ్ర వాదనలు వినిపించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల విషయమై వెంటనే పార్లమెంటును సమావేశపరిచి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
రోజా ఓ పార్ట్టైమ్ ఎమ్మెల్యే
ఆమె ఓ పార్ట్టైమ్ ఎమ్మెల్యే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉద్దేశించి ఏపీ హోమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. దాచేపల్లి లాంటి ఘటనలను రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. దాచేపల్లిలో మైనర్ బాలికపై 53ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఎంతో బాధాకరమని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి చెప్పారు.
దాచేపల్లి బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
బాధితురాలి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించామని చినరాజప్ప తెలిపారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, దాచేపల్లిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. నిందితుడి కోసం 15పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, నిందితుడి గురించి ఎవరైనా సమాచారం ఇస్తే తగిన బహుమానం ఇస్తామని తెలిపారు.