ఆటోవాలాగా ఎంపీ నామా: గాడిదనెక్కి బంగి అనంతయ్య
జెడి శీలం వాకింగ్ ముచ్చట్లు
మన చుట్టూ ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన నాయకులే మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారని కేంద్ర మంత్రి జెడి శీలం వ్యాఖ్యానించారు. అయినా, తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, దీని కోసం కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. ఆయన ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
విభజనపై చెప్పేదేమీ లేదు: డిజిపి
విభజనపై తాను కొత్తగా చెప్పేదేమీలేదని డిజిపి ప్రసాద రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ విభజనపై తాను చెప్పేదేమీ లేదన్నారు.
బంగి వినూత్న నిరసన
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆదివారం గాడిదనెక్కి నిరసన వ్యక్తం చేశారు. విభజన ప్రకటనకు నిరసనగా ఆయన మూడు నెలల క్రితం అరగుండు గీయించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు అరగుండుతోనే ఉంటానని ఆయన ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.
గతవారం దున్నపోతునెక్కి నిరసన తెలిపిన బంగి ఆదివారం కలెక్టరేట్ ఎదుట అనుచరులతో కలిసి వచ్చిన ఆయన గాడిదపైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలెవరూ విభజనను కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంపై అవగాహన లేనివారు తయారు చేసిన బిల్లు ప్రజలకు ఆమోదయోగ్యం కాదన్నారు.