సీఎం నేమ్ ప్లేట్ పై రచ్చ రచ్చ..! సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న జగన్ ..!!
విజయవాడ/అమరావతి : ఏపీ రాజకీయాలు ఎన్నికల ముందు ఎంత ఉత్కంటగా కొనసాగాయో ఎన్నికల తర్వాత కూడా అంతే ఉత్కంఠ రేపుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయం ఖాయమైందా..? ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారా..? ఫలితాల మాట ఎలా ఉన్నా.. వైసీపీ, టీడీపీలు మాత్రం విజయం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే నేమ్ బోర్డ్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.
ఈ నేమ్బోర్డ్ చూసిన కొంతమంది వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చేవీ ఏవీ పూర్తిగా నమ్మలేం. ఈ నేమ్బోర్డును ఖచ్చితంగా వైసీపీ వారే తయారు చేయించారనే గ్యారంటీ కూడా లేదు. అలాగని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో జగన్ తప్పకుండా సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ముందుగా సన్నాహాలు చేసుకోవడంలో తప్పులేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నేమ్ బోర్డును సిద్ధం చేసుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయాన్ని చెప్పలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏపీలో అత్యధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లు ఎటు మొగ్గారనేది సస్పెన్స్. అయితే, ఓటింగ్ సరళి అంచనాల ప్రకారం వైసీపీ శ్రేణులు తమదే విజయమని, ఈసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 100 సీట్లకు పైనే వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. జగన్ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన నేమ్బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.