హెరిటేజ్ కేసు... మంత్రి కన్నబాబు,ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్...
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకానందునా వీరిద్దరికీ ఈ వారెంట్ జారీ చేసింది. తదుపరి వాయిదాకు ఇద్దరూ తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
హెరిటేజ్ సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారన్న కారణంతో గతంలో ఆ సంస్థ కన్నబాబు,అంబటి రాంబాబులపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు ఈ ఇద్దరూ మొదటినుంచి హాజరుకావట్లేదు. ఈ ఏడాది జనవరిలో కేసు విచారణ చేపట్టిన కోర్టు... ఫిబ్రవరి 5న కన్నబాబు,అంబటి రాంబాబు తప్పనిసరిగా కోర్టుకు హాజరవాలని ఆదేశించింది. హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయినప్పటికీ కన్నబాబు,అంబటి కోర్టుకు హాజరవలేదు. తాజా విచారణ సందర్భంగా కోర్టు ఆ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు పాటించనందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
హెరిటేజ్ ఫుడ్స్పై వైసీపీ నేతలు పలు సందర్భాల్లో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అవాస్తవాలనీ,నిరాధారమని గతంలోనే హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు కొట్టిపారేశారు. 1993-94లో హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించినప్పుడు దాని ఆదాయం రూ.4 కోట్లు అని... ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2019-20 నాటికి రూ.2726కోట్లుకు చేరిందని అన్నారు. కంపెనీ పనితీరు,విశ్వసనీయత,క్రమశిక్షణల కారణంగానే హెరిటేజ్ షేర్ విలువ పెరిగిందన్నారు. అంతే తప్ప ఇతర అంశాలేవీ దాన్ని ప్రభావితం చేయలేదన్నారు. ఇప్పటివరకూ హెరిటేజ్ ఏ బ్యాంకుకు పన్ను ఎగవేయలేదని... సకాలంలో రుణఆలను చెల్లిస్తున్నామని తెలిపారు.
Recommended Video
మొత్తం 3లక్షల మంది రైతులు హెరిటేజ్ సంస్థకు పాలు విక్రయిస్తున్నారని... 20వేల మంది డిస్ట్రిబ్యూటర్లు,ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. 1500 మంది ట్రాన్స్పోర్టర్స్,2వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్,3వేల మంది సిబ్బంది హెరిటేజ్ సంస్థపై ఆధారపడినట్లు చెప్పారు. నిరాధార ఆరోపణలతో రైతుల జీవనాధారాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు.