హైకోర్టుకెళ్లండి: రామలింగరాజుకు నాంపల్లి కోర్టు, చర్లపల్లి జైల్లో ఖైదీల నిరసన
హైదరాబాద్: సత్యం రామలింగ రాజు అప్పీల్ పిటిషన్ను నాంపల్లి న్యాయస్థానం సోమవారం నాడు తిరస్కరించింది. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని రామలింగ రాజుకు, ఇతరులకు న్యాయస్థానం సూచించింది.
కాగా, సత్యం కుంభకోణం కేసులో దోషులుగా నిర్ధారితమై జైలు శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజులు సోమవారం నాడు నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ వారు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.
వారు ఏడేళ్ల జైలు శిక్షను సవాల్ చేశారు. ప్రత్యేక కోర్టు తీర్పు కొట్టివేయాలని వారు కోరారు. న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసి, హైకోర్టుకు వెళ్లాలని ఈ రోజు సూచించింది.
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు, మరో తొమ్మిది మందికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను, నగదు జరిమానాను విధించిన విషయం తెలిసిందే. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం సమయమిచ్చింది. దీంతో సోమవారం రామలింగ రాజు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు.
చర్లపల్లి కారాగారంలో ఖైదీల నిరసన
హైదరాబాదులోని చర్లపల్లి కారాగారంలో పలువురు ఖైదీలు నిరసన చేపట్టారు. అల్పాహారం తీసుకోకుండా వారు ఆందోళనకు దిగారు. ఖైదీ శివకుమార్ మృతికి అధికారులే కారణమని, జైలు అధికారులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.