అసెంబ్లీతో మీకేం సంబంధం?: ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు ఆగ్రహం
పరువునష్టం కేసులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది.
హైదరాబాద్: పరువునష్టం కేసులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. డిసెంబర్ 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోయినట్లు ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మీకు ఏంటి సంబంధమని కోర్టు సూటిగా ప్రశ్నించింది. డిసెంబర్ 5న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని స్పస్టం చేసింది.
వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కండీషనల్ ఆర్డర్ జారీ చేసింది. కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించి.. జగన్ పరువు-ప్రతిష్టను దెబ్బ తీసిందని ఆరోపిస్తూ ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.