'టైంలేదు వెళ్తున్నా, హరికృష్ణ నోట చివరి మాటలు ఇవే! ఆ మాట తొలిసారి'
హైదరాబాద్: వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. అంతకుముందు, రెండు రోజుల క్రితం తాను అతనితో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. ఆగస్ట్ 27వ తేదీన ఉదయం తాను హరికి ఫోన్ చేశానని తెలిపారు.
మా అల్లుడు, కూతురు మీ ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చారు, చూశావా అని అడిగానని, దానికి హరికృష్ణ.. ఎవరి పెళ్లి అని అడిగారని, అందుకు తాను తన మనవరాలి పెళ్లి ఆగస్ట్ 30వ తేదీన ఉందని చెప్పాని, నువ్వు వచ్చి అక్షింతలు వేస్తే అన్నగారు ఎన్టీఆర్ వచ్చి వేసినట్లుగా భావిస్తామని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
హరికృష్ణను అడిగితే రాలేనని చెప్పారు
పెళ్లి రావాలని హరికృష్ణను అడగ్గా.. తాను రాలేనని, సారీ అని, 29వ తేదీ ఉదయాన్నే తాను మరో ఊరుకు వెళ్తున్నానని, 30వ తారీఖు ఉదయం రాగలుగుతానో లేదో తెలియదని చెప్పారని పరుచూరి అన్నారు. 31వ తారీఖున సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని, నోముకు వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని అడిగానని, అప్పుడు కూడా ఆయన రాలేనని చెప్పారని అన్నారు.
రాలేను అని ఆయన నోట వినడం మొదటిసారి
రాలేను అని హరికృష్ణ నోట నుంచి తాను వినడం ఇదే మొదటిసారి అని పరుచూరి అన్నారు. ఈ రోజునే అంటే ఆగస్ట్ 27నే ఉదయం పదకొండున్నర గంటలకు తన మనవరాలిని పెళ్లి కూతురును చేస్తారని, అప్పుడు వచ్చి అక్షితలు వేయమని చెప్పానని అన్నారు.
బయటకు వెళ్లినప్పుడు హరికృష్ణ వచ్చారు
ఆ రోజు తాను బయటకు వెళ్లిన సమయంలో హరికృష్ణ వచ్చి తన మనవరాలిని ఆశీర్వదించారని, ఆయన వచ్చిన విషయం తెలిసి, బయట ఉన్న తాను ఫోన్ చేసి.. రెండు నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పానని, కానీ ఆయన తనకు టైం లేదని, వెళ్లిపోతున్నానని చెప్పారని, ఆయనతో దేవుడు అలా మాట్లాడించారో.. ఎందుకు అలా జరిగిందో అర్థం కావడం లేదన్నారు.
టైంలేదు వెళ్లిపోతున్నానని చెప్పారు
ఆ రోజు తాము పెళ్లి కొడుకు వాళ్ల ఇంటికి వెళ్లామని, ఆ సమయంలోనే హరికృష్ణ వచ్చారని, హరికృష్ణ పదకొండు గంటలకు వచ్చి కూర్చున్నారని, అక్షింతలు వేసి వస్తానమ్మా అని తమ పిల్లలతో చెబితే.. నాన్నగారు వస్తారు, ఉండమని చెప్పగా.. వెళ్లానని చెప్పండని సూచించాడని పరుచూరి గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను ఫోన్ చేసి రెండు నిమిషాలు ఉండమంటే.. టైంలేదు వెళ్లిపోతున్నానని చెప్పారని, తనతో ఆయన మాట్లాడిన చివరి మాటలు ఇవే అన్నారు.