నందమూరి హరికృష్ణ మృతి: ఇక తెలుగుదేశం పార్టీ పూర్తిగా...!!
అమరావతి: నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధీనంలోకి వచ్చిందని ప్రముఖ నేషనల్ మీడియాలో కథనం వచ్చింది. 1995 నుంచి చంద్రబాబే టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే పలు సందర్భాల్లో నందమూరి కుటుంబం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
Recommended Video
పైగా, హరికృష్ణ నారా కుటుంబం ఆధిపత్యంపై ఇటీవల పలుమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కథనం ఇచ్చినట్లుగా భావించవచ్చు. పలు సందర్భాల్లో చంద్రబాబుకు హరికృష్ణ కొరకురాని కొయ్యలా తయారయ్యాడనే వార్తలు వచ్చాయి. అలాంటి కీలక నేత మృతి కారణంగా టీడీపీ ఇప్పుడు పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు చేతికి వచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు.
హరికృష్ణ విభేదించారు
నందమూరి, నారా కుటుంబాల మధ్య ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం విషయంలో ప్రత్యక్ష, పరోక్ష వాగ్యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబం అన్నప్పటికీ.. హరికృష్ణ మాత్రమే నారా ఆధిపత్యాన్ని పలుమార్లు ప్రశ్నించారు. ఎన్టీఆర్ వారసులుగా నందమూరి కుటుంబం వారసత్వంపై ఆయన పలుమార్లు నిలదీశారు. చంద్రబాబుతో విభేదించారు.
చంద్రబాబుపై ఆగ్రహం
ఇరవై మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ను గద్దె దించిన సమయంలో లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి కుటుంబం అంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించిన హరికృష్ణ అన్న తెలుగుదేశం స్థాపించారు. అనంతరం చంద్రబాబుకు దగ్గరై ఆయన నాయకత్వంలో పని చేశారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీని వీడి పార్టీని స్థాపించి, ఆ తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబుతో పలుమార్లు విభేదించి, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారసత్వంపై పోటాపోటీ
ఏడేళ్ల క్రితం చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ను తెరపైకి తెస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును కొందరు తెరపైకి తెచ్చారు. ఆ సమయంలో హరికృష్ణ వారసత్వం విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి వారి సంగతేమిటని ప్రశ్నించారు. అంతకుముందు ఆయన టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హరికృష్ణ పదేపదే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఆయనకు మరోసారి రాజ్యసభ సీటు కేటాయించి చంద్రబాబు చల్లబరుస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు.
పురంధేశ్వరి కూడా విమర్శలు చేసినా
పేరుకు నందమూరి వర్సెస్ నారాగా కనిపించినప్పటికీ హరికృష్ణ వాయిస్ వినిపించింది. ఆ తర్వాత పురంధేశ్వరి మినహా నందమూరి కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు వైపు ఉంటారు. దీంతో నందమూరి తరఫున టీడీపీలో ఉంటూ బలంగా వాయిస్ వినిపించింది హరికృష్ణే. పురంధేశ్వరి కూడా విమర్శలు చేసినప్పటికీ కొంత తేడా ఉంటుంది. ఆమె మొదట కాంగ్రెస్లో, ఆ తర్వాత బీజేపీలో ఉంటూ విమర్శలు చేస్తున్నారు. హరికృష్ణ టీడీపీలోనే ఉంటూ చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. అదీ ముఖ్యంగా వారసత్వం విషయంలో. పైగా పురంధేశ్వరి రాజకీయంగా, ఆచితూచి, అప్పుడప్పుడు మాట్లాడుతారు. హరికృష్ణ అందుకు భిన్నం. హరికృష్ణ మృతి తర్వాత.. రాజకీయాల్లో ఉన్న నందమూరి వారసుల్లో బాలకృష్ణ చంద్రబాబు మద్దతుదారు కాగా, పురంధేశ్వరి ఇతర పార్టీలోని వారని పేర్కొంటున్నారు. మొత్తంగా టీడీపీ చంద్రబాబు కంట్రోల్లోకి పూర్తిగా వచ్చిందని ఆ కథనం సారాంశం. కాగా, రాజకీయాలు వేరు, బంధాలు, బాంధవ్యాలు వేరు. హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసి చంద్రబాబు కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.