ఆసక్తి, టీడీపీ నేతల చర్చ: హరికృష్ణ రాకతో బెజవాడలో అంతా ఏకమయ్యారు
విజయవాడ: టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ నందమూరి హరికృష్ణ విజయవాడ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతొంది. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని బందరు రోడ్డులో వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు.
అనంతరం హాజరైన హరికృష్ణ మాట్లాడుతూ అన్నగారి పేరు మీద వెటర్నరీ ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రైతుల ప్రయోజనం కోసమే ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ స్థలాన్ని గతంలో ఎవరూ అడిగినా ఇవ్వలేదని, అన్నగారి పేరిట ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామని అన్నారు.
ఏపీలోని 13 జిల్లాల ప్రజలు ఈ ఆసుపత్రి సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా రైతులు పట్ల అన్నగారికి ఉన్న ప్రేమను చాటుకుంటారని తెలిపారు. 13 జిల్లాల ప్రజలకు కేంద్రంగా ఉండాలని ఆనాడు చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పంపినప్పుడు ఈ ఆసుపత్రికి నిధులు మంజూరు చేశానని చెప్పుకొచ్చారు.
ఈ మహోన్నత ఆసుపత్రిని ఇక్కడి నేతలైన దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్లు మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.1.65 కోట్లు హరికృష్ణ కేటాయించారని, ఇందుకు ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు.
13 జిల్లాలకు పశువ్యాధుల పరిశోధనా కేంద్రంగా ఈ ఆసుపత్రి ఉండబోతోందని ఇందుకు మరో రూ. 1.15 కోట్లు అవసరమన్నారు. సీఎంతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తామని మంత్ర ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నేతలు హాజరవడంతో కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో పెద్ద చర్చకు తెరలేచింది.
వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ హాజరవడం ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా హరికృష్ణ చుట్టూ కూర్చుని నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హరికృష్ణ వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ఒకే కారులో వచ్చారు.
హరికృష్ణతో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని... హరికృష్ణ, గద్దె రామ్మోహన్ రావులకు మధ్య కాస్తంత వెనుకగా కూర్చున్నారు. హరికృష్ణ పక్కన దేవినేని ఉమా కూర్చున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ, గద్దెలతో కొడాలి నాని నవ్వూతూ మాట్లాడారు.
టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత ఎక్కడా బహిరంగంగా నందమూరి కుటుంబసభ్యులతో కొడాలినాని కనిపించిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో అక్కడకి మరో వ్యక్తి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్. హరికృష్ణను కలిసి అప్యాయంగా పలకరించారు.
పనిలో పనిగా అక్కడ ఉన్న టీడీపీ నేతలను ఆయన పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాను వచ్చానని, ఎన్టీఆర్ పేరు మీదున్న ఆసుపత్రి కావడంతోనే వచ్చానని దేవినేని అవినాశ్ ప్రకటించారు.
ఇలా హరికృష్ణ విజయవాడ పర్యటనలో పార్టీలకు అతీతంగా నేతలంతా ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.