నందమూరి యువసేన వీరంగం: జాతీయరహదారిపై కార్లు, బైక్లతో హల్చల్
Recommended Video
విజయవాడ: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నందమూరి యువసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయ రహదారిపై మద్యం తాగి వేగంగా కార్లు నడిపారు. అంతేగాక, కార్లపై కూర్చుని హల్చల్ చేశారు.
కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు నందమూరి యువసేన పేరుతో స్థానిక పేరకలపాడు రోడ్డు పక్కన మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత కార్లు, బైక్ లతో క్రాస్ రోడ్ నుంచి కంచికచర్లకు ర్యాలీ నిర్వహించారు.
కాగా, జాతీయ రహదారిపై మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ కోన్ లను తొక్కిస్తూ అక్కడివారిని భయాందోళనలకు గురిచేశారు.
ఈ క్రమంలో కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎన్ హెచ్ఏఐ అధికారులు కార్మికులతో మాట్లాడి కేసు పెట్టవద్దని వారిని వారించినట్లు తెలిసింది.