నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం: గ్రానైట్ రాయికి పూజలు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో జరిగిన నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న గ్రానైట్ రాయికి అపరిచిత వ్యక్తులు పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద సోమవారం ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి పూజలు నిర్వహించారు. రాయికి కొబ్బరికాయ కొట్టారు.
గ్రానైట్ రాయిని అనుమతి లేకుండా తరలించబోయిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రాయిని సంబంధిత వ్యక్తులు ఒకటి రెండు రోజుల్లో అక్కడి నుంచి తీసుకువెళ్లనున్నారని, మరోమారు ఏ ప్రమాదం జరుగకుండా మంత్రగాళ్ల సూచన మేరకు పూజలు నిర్వహించారన్న ప్రచారం జరుగుతున్నది.
తక్కువ ప్రాణ నష్టం జరిగినందున రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని మరో వాదన వినిపిస్తున్నది. గ్రానైట్ రాయికి పూజ నిర్వహించడంపై ఇంకా పలు ఆసక్తికరమైన చర్చ ఆ ప్రాంతంలో జరుగుతోంది.