పవన్ కళ్యాణ్తో నాదెండ్ల మనోహర్ భేటీ: తాజా పరిణామాలపై చర్చ, జనసేనలో చేరతారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో వారిద్దరూ దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ క్రమంలో పవన్ తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు మనోహర్ దూరంగా ఉన్నారు.
ఈ భేటీ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, 2011 జూన్లో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్గా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.