అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తే తమ సామాజికవర్గమే పాలించాలి.. రాజధానిలో తమ సామాజికవర్గమే ఉండాలన్న రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో దళితులను తిరగినిచ్చే పరిస్థితి లేదని.. అలాంటిది ఇక్కడే రాజధానిని కొనసాగిస్తే తమను బతకనిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా చేతకాని దద్దమ్మ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆడవాళ్లతో దాడులు చేయించడం మాని.. చేతనైతే మగాడిలా రాజకీయం చేయాలని అన్నారు.
చెవుల్లో ఇష్టమొచ్చినట్టుగా తిట్టారన్న ఎంపీ
అమరావతిలో రథ మహోత్సవానికి వెళ్తున్న సమయంలోనే తన కారుపై కొంతమంది కర్రలతో దాడి చేశారని ఎంపీ ఆరోపించారు. అయితే దాన్ని చూసీ చూడనట్టు వదిలేసి రథోత్సవానికి వెళ్లామన్నారు. రథ మహోత్సవం ముగించుకుని కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు.. కొంతమంది జై సీబీఎన్,జై అమరావతి అంటూ తన వెనకాల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెంబడించారని చెప్పారు. అయినా సరే పట్టించుకోకుండా ముందుకెళ్లామని.. కానీ కొంతమంది మహిళలు తనవద్దకు వచ్చి చెవుల్లో ఇష్టమొచ్చినట్టు తిట్టారని ఆరోపించారు.
అరేయ్ ఎంపీ అంటూ అనుచిత వ్యాఖ్యలు..
తన కారు వచ్చేందుకు ఆలస్యం అవుతుండటంతో మరో కారులో అక్కడినుంచి ఇంటికి బయలుదేరామని సురేష్ చెప్పారు. లేమళ్ల వద్ద తిరిగి తన కారులో ఎక్కేందుకు వేచి ఉండగా.. అక్కడికి ఓ బస్సు వచ్చిందన్నారు. బస్సు నుంచి దిగిన కొంతమంది మహిళలు తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. ఓ మహిళ 'అరేయ్ ఎంపీ..' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు. అయినా సరే తాను సంయమనంతో వ్యవహరించానే తప్ప తిరిగి తిట్టలేదన్నారు.
కనీసం ఎంపీ హోదాకైనా విలువ ఇవ్వరా..
బస్సు నుంచి దిగొచ్చిన మహిళలు తనపై కారంతో దాడి చేసేందుకు యత్నించగా.. తన మనుషులు కళ్లకు చేతులు అడ్డుపెట్టి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారని అన్నారు. ఆ తర్వాత తన పీఏని,ఆయన అన్నయ్యను చెప్పుతో కొట్టారని అన్నారు. అమరావతిలో అందరూ తిరుగుతున్నారని.. కానీ దళితులు అడుగుపెడితేనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్యాకేజీ విషయంలోనూ దళితులను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడిలా తన మనుషులతో దాడి చేయిస్తున్నారని అన్నారు. దళితులకు ఎటూ విలువ ఇవ్వరని... కనీసం తనకున్న ఎంపీ హోదానైనా గౌరవించరాఅని ప్రశ్నించారు.
అర్థరాత్రి 2గంటలకు ఫోన్లు చేసి బెదిరింపులు...
లింగాయపాలెం వద్ద తన మనుషులు ఐదుగురిని టీడీపీ కార్యకర్తలు రక్తం కారేలా కొట్టారని సురేష్ ఆరోపించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు అక్కడినుంచి బయటపడ్డారన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అర్థరాత్రి 2గంటలకు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. నోటికొచ్చినట్టు తిడుతున్నారని.. వదిలే ప్రసక్తే లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రాన్ని తమ సామాజికవర్గమే ఏలాలన్న కాన్సెప్టులో టీడీపీ ఉందని.. దళితులు ఊరి చివరే ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే అసెంబ్లీ ఉంచారని.. ఇప్పుడే ఇలా దాడులు చేస్తుంటే.. రేప్పొద్దున తనను అసెంబ్లీకి రానిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుది రక్తచరిత్ర అని.. భౌతిక దాడులు చేయించడం ఆయనకు అలవాటేనని ఆరోపించారు. తనపై దాడి చేయించింది చంద్రబాబేనని.. ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.