జగన్కు ‘నంద్యాల’ షాక్: తగ్గని టీడీపీ, భారీ మెజార్టీతో భూమా గెలుపు ,చివరలో షాకిచ్చినా..
అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి.
కర్నూలు: ప్రతిష్టాత్మక నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 19రౌండ్లలో 16వ రౌండ్ మినహా ఏ రౌండ్లోనూ వైసీపీ ఆధిక్యాన్ని చాటుకోలేదు.
కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తయ్యాయి.
టీడీపీ గెలుపుతో పార్టీ శ్రేణులు నంద్యాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని భావించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఫలితాలు గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది.
19/19:
-టీడీపీ-97,176
-వైసీపీ-69,610
-కాంగ్రెస్-1,382
ఓటమిని అంగీకరించిన శిల్పా మోహన్
వరుసగా అన్ని రౌండ్లలో టీడీపీ ఆధిక్యాన్ని చాటుకుంటున్న నేపథ్యంలో ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ హాల్ నుంచి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి బయటికి వెళ్లిపోయారు. సానుభూతి, డబ్బులు పంచడమే టీడీపీ ఆధిక్యానికి కారణమని అన్నారు. ముస్లిం మైనార్టీలు కూడా టీడీపీ వైపే ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న అఖిలప్రియ సవాల్ను తాను స్వీకరించలేదని చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మాట్లాడతామని చెప్పారు. పరోక్షంగా ఆయన తన ఓటమిని అంగీకరించినట్లే తెలుస్తోంది.
19వ రౌండ్లోనూ టీడీపీ..
చివరిదైన 19రౌండ్లోనూ టీడీపీ 367ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
18వ రౌండ్లోనూ..
18వ రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని చాటింది. 506ఓట్ల ఆధిక్యం లభించింది. 18వ రౌండ్ ముగిసేసరికి 27,029ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది టీడీపీ.
17వ రౌండ్లో మళ్లీ టీడీపీ..
17వ రౌండ్లో మళ్లీ టీడీపీ 915ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 17వ రౌండ్ ముగిసేసరికి 25,993 ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేసింది. టీడీపీకి 5,163, వైసీపీకి 4,248 ఓట్లు వచ్చాయి.
కాగా, పోలైన ఓట్లలో ఇప్పటికే 50శాతానికిపైగా ఓట్లు సాధించింది టీడీపీ. దీంతో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
16వ రౌండ్లో షాకిచ్చిన వైసీపీ
16వ రౌండ్లో తొలిసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 654ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ముగిసిన 16రౌండ్లలో వైసీపీ ఆధిక్యం చూపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వైసీపీకి 5,317 ఓట్లు రాగా, టీడీపీకి 4,663ఓట్లు వచ్చాయి.
15వ రౌండ్లోనూ..
15వ రౌండ్లోనూ టీడీపీకి 1,442ఓట్ల ఆధిక్యం లభించింది. 15వ రౌండ్ ముగిసే సరికి 26,047ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
14వ రౌండ్లోనూ..
వరుసగా 14వ రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని చాటింది. 1304ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేసింది. 14వ రౌండ్ ముగిసే సరికి మొత్తం 24,605ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
13వ రౌండ్లోనూ..
13వ రౌండ్లో 1460ఓట్ల ఆధిక్యం సాధించింది. 13 రౌండ్ ముగిసేసరికి టీడీపీ 23,301ఓట్ల ఆధిక్యాన్ని చాటుకుంది.
12వ రౌండ్లోనూ దూసుకెళ్తున్న సైకిల్
12వ రౌండ్లోనూ టీడీపీ భారీ ఆధిక్యత లభించింది. 1580ఓట్ల ఆధిక్యం సాధించింది. 12వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ 21,841ఓట్ల మెజార్టీని నమోదు చేసింది. టీడీపీకి 5,629 ఓట్లు రాగా, వైసీపీకి 4,049ఓట్లు వచ్చాయి.
11వ రౌండ్లోనూ టీడీపీ జోరు
11వ రౌండ్లోనూ టీడీపీ తన జోరును కొనసాగించింది. 604 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్ ముగిసేసరికి 20,261ఓట్ల భారీ ఆధిక్యాన్ని చాటుకుంది. 11వ రౌండ్లో టీడీపీకి 4,326 ఓట్లు రాగా, వైసీపీకి 3, 722 ఓట్లు వచ్చాయి.
10వ రౌండ్లోనూ..
వరుసగా పదో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని సాధించింది. 1486ఓట్ల మెజార్టీని సాధించింది. పదో రౌండ్ ముగిసే సరికి 19,706 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
9వ రౌండ్లో పెరిగిన ఆధిక్యం
9వ రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యత చాటుకుంది. 879 ఓట్ల ఆధిక్యత సాధించి దూసుకెళ్తోంది. 9వ రౌండ్ ముగిసే సరికి 18,220 ఓట్ల ఆధిక్యతను సాధించింది. 9వ రౌండ్లో టీడీపీకి 4309, వైసీపీకి 3430ఓట్లు వచ్చాయి.
ఎనిమిదో రౌండ్లోనూ.. కానీ
ఎనిమిదో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యతను చాటుకుంది. 340 ఓట్ల ఆధిక్యాన్ని చాటుకుంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 17,350 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. టీడీపీకి 4,436 ఓట్లు రాగా, వైసీపికి 4088ఓట్లు వచ్చాయి. అయితే, ఇంతకుముందు రౌండ్లతో పోల్చితే ఈ రెండు(6,7) రౌండ్లలో ఆధిక్యత తగ్గడం గమనార్హం.
జగన్ జెండా పీకెస్తారు: అచ్చెన్నాయుడు
జగన్ తన పార్టీ జెండాను త్వరలోనే పీకేస్తారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నంద్యాల ప్రజలు మంచి తీర్పు చెప్పారని అన్నారు. డేారా బాబుకు జగన్ కు పోలిక వుందని, ఇక జగన్ బాబా ఏపీలో ఉండకూడదని అన్నారు. జగన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఆయన మనస్తత్వం వల్లే వైసీపీ ఓడిపోయిందని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.
ఏడో రౌండ్లోనూ
ఏడో రౌండ్లోనూ భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యాన్ని కొనసాగించారు. 500లకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని చాటుకుంది. ఏడో రౌండ్ ముగిసేసరికి 17,206ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
మా నాన్నకు నివాళి: అఖిలప్రియ
నంద్యాల ప్రజలు తన తండ్రికి టీడీపీని గెలిపించి ఘన నివాళి ఇస్తున్నారని మంత్రి భూమా నాగిరెడ్డి చెప్పారు. తమకు మద్దతుగా నిలిచిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, ప్రజలు నిలిచారని అన్నారు. సీఎం మద్దతు లేకుంటే ఇంత భారీ మెజార్టీ వచ్చేది కాదని అన్నారు.
ఆరో రౌండ్లోనూ..
ఆరో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని కనబర్చింది. ఈ రౌండ్లో 1000కిపైగా ఆధిక్యం వచ్చింది. ఆరో రౌండ్ ముగిసే సరికి టీడీపీకి 16,464ఓట్ల ఆధిక్యం లభించింది.
ఐదో రెండ్లోనూ..
ఐదో రౌండ్లోనూ టిడిపి ఆధిక్యం సంపాదించింది. ఈ రౌండ్లో మూడు వేలకు పైగా ఆధిక్యం వచ్చింది. దీంతో ఐదో రౌండ్ ముగిసేసరికి టీడీపీ 13,143ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
నాలుగో రౌండ్లోనూ..
నాలుగో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్లో 3,600 ఓట్ల ఆధిక్యంతో బ్రహ్మానందరెడ్డి దూసుకెళ్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 9,670 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఇక వైసీపీకి 2,868 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్లోనూ భూమాదే ఆధిక్యం
మూడో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని చాటుకుంది. మూడో రౌండ్లో 3113 ఓట్ల ఆధికాన్ని సాధించింది. ఈ రౌండ్లో టీడీపీకి ఆధిక్యం మరింత పెరగడం గమనార్హం. మూడో రౌండ్ ముగిసే సరికి 6,071 ఓట్ల ఆధిక్యం సాధించింది.
రెండో రౌండ్లోనూ టీడీపీదే ఆధిక్యం
రెండో రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ 1634ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. రెండో రౌండ్ ముగిసే సరికి 2832ఓట్ల ఆధిక్యాన్ని చాటుకుంది.
తొలి రౌండ్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యం
ఓట్లు ప్రారంభమైన తొలి రౌండ్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఆధిక్యతను ప్రదర్శించారు. టీడీపీకి 5477ఓట్లు రాగా, వైసీపీకి 4279ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీకి 1198ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 69ఓట్లు లభించాయి.
చెల్లని పోస్టల్ బ్యాలెట్
నంద్యాలలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8గంటలకు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎందుకంటే ఉద్యోగులు ఎవరికి ఓటు వేయలేదు. నంద్యాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 250 ఉండగా అందులో 39 చెల్లలేదు.
అంతకుముందు కథనం..
కాగా, సోమవారం ఉదయం 10.30-11.00గంటలకల్లా లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై మొత్తం 19రౌండ్లు కొనసాగనుంది. రౌండ్ల వారీగా మెజార్టీని తెలిపేందుకు కౌంటింగ్ కేంద్రం ఎదుటనే పెద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. మొదట నంద్యాల మండలంలోని గ్రామీణంతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
అనంతరం పట్టణం, మరికొన్ని నంద్యాల గ్రామీణం ఆ తర్వాత గోస్పాడు మండలం లెక్కింపు ఉంటుంది. గోస్పాడులో అత్యధికంగా 90.81శాతం పోలింగ్ నమోదైనందున ఇది ఏ పార్టీకి కలిసోస్తుందనే దానిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో చివరి వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. నియోజకవర్గంలో అత్యధికంగా 79.20శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.
కాగా, అభివృద్ధి నినాదంతో టీడీపీ ఓటర్ల వద్దకు వెళ్లగా.. ప్రభుత్వ వ్యతిరేకత, గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో టీడీపీ విఫలమైదంటూ వైకాపా అధినేత జగన్ ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షనేత 13రోజలపాటు నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం నిర్వహించగా.. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో రెండు రోజులు, ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రెండు పర్యాయాలు నంద్యాలలో పర్యటించారు.
నంద్యాల ఉప ఎన్నికలో పోటీ అభ్యర్థుల మధ్యకాకుండా చివరికి అయా పార్టీల అధినేతల మధ్య పోటీగా సాగింది. నంద్యాల ఓటరు తీర్పు రాబోయే 2019 ఎన్నికలకు నాందిగా వైకాపా అధినేత జగన్ ప్రచార సమయంలోనే ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను ఈ ఎన్నిక ప్రభావితం చేస్తుందని టీడీపీ, వైకాపా నేతలు భావిస్తున్నారు. ఈ ఫలితాలు కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
కాగా, నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. లక్షల నుంచి కోట్ల వరకు ఈ బెట్టింగులు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, గెలుపుపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రలోబాలు పెట్టినా ప్రజలంతా తమవైపే ఉన్నారని సోమవారం ఉదయం శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. జగన్ పార్టీ అండ, తన సొంత బలంతో తామే గెలుస్తున్నామని చెప్పారు.