నమ్ముకుంటే గట్టి షాక్: పెళ్లి రోజే జగన్కు ఇలా, పీకే సర్వేకు టిడిపి చెక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి వెనుకంజలో ఉండటంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అత్యవసర సమీక్ష నిర్వహించి పార్టీ శ్రేణులపై చిర్రుబుర్రులాడినట్లుగా వార్తలు వచ్చాయి.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థి వెనుకంజలో ఉండటంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అత్యవసర సమీక్ష నిర్వహించి పార్టీ శ్రేణులపై చిర్రుబుర్రులాడినట్లుగా వార్తలు వచ్చాయి.
చదవండి: వైసిపి ఓటమి: సన్యాసంపై అఖిలప్రియకు సవాల్ మీద శిల్పా ట్విస్ట్
మరోవైపు, జగన్, భారతిల పెళ్లి రోజు ఇవాళే (సోమవారం). పెళ్లి రోజే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపికి చేదు ఎదురైంది. ఓ వైపు పెళ్లి రోజు, మరోవైపు ఓటమి.. ఈ పరిస్థితుల్లో లోటస్ పాండ్ వెలవెలబోయింది.
జగన్ - భారతిల పెళ్లి రోజే ఇలా..
నంద్యాల గెలుపుతో పెళ్లి రోజును మరింత ఘనంగా చేసుకోవాలని భావించిన జగన్ కుటుంబ సభ్యుల ఆశలు నీరుగారిపోయాయి. జగన్ ప్రతీ సంవత్సరం సన్నిహితులతో కలిసి పెళ్లి రోజు జరుపుకుంటారు.
పెళ్లి రోజు జరుపుకునేందుకు జగన్ విముఖత
కానీ ఈ సంవత్సరం ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల ప్రతికూల ఫలితం వల్ల జగన్ పెళ్లి రోజును జరుపుకునేందుకు కూడా విముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
గట్టి పోటీ ఇవ్వలేకపోయిన శిల్పా
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టిడిపికి పట్టం కట్టారు. భూమా బ్రహ్మానంద రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టిడిపినే ఆధిక్యాన్ని కనబరిచింది. వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.
గోస్పాడుపై వైసిపి ఆశలు
నంద్యాల పట్టణంలోనే టిడిపికి భారీ మెజార్టీ వచ్చింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. గోస్పాడు మండల ప్రజలు ఇచ్చిన తీర్పు మరో ఎత్తు. ఎన్నికల ప్రచారం మొదలయిన దగ్గర్నుంచి వైసిపి నేతలు చెప్పుకొచ్చిన మాట ఒక్కటే. గోస్పాడులో తమ పార్టీకి పట్టు ఉందని, అందుకు గత ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
ఆశలు అడియాసలు
అయితే వైసిపి ఎన్నో ఆశలు పెట్టుకున్న గోస్పాడు మండల ప్రజలు కూడా ఆ పార్టీకి గట్ిట షాకిచ్చారు. గోస్పాడు, యాళ్లూరు, ఎం క్రిష్ణాపురం, దీబగుంట్ల, పార్వతీపురం, జిల్లేళ్ల, జులేపల్లి, చింతకుంట్ల, పసురపాడు, తేళ్లపురి గ్రామాలు ఈ మండల పరిధిలో ఉన్నాయి. గోస్పాడు మండలంలో మొత్తం 28,844 ఓట్లకు గానూ 26,193 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటర్లలో మెజార్టీ ఓటర్లు టిడిపికి మద్దతుగా నిలవడంతో వైసిపి నేతలు షాకయ్యారు.
టిడిపికే ఎక్కువ ఓట్లు, జగన్ ఆశలన్నీ నీరుగార్చారు
వైసిపి ఎన్నో ఆశలు పెట్టుకున్న గోస్పాడు మండలంలో టిడిపి.. వైసిపి కంటే ఎక్కువ ఓట్లే దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఇక్కడి టిడిపి ఎగిరి గంతేస్తోంది. గోస్పాడుపై జగన్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.
అప్పుడు భూమాకు 5వేల పై చిలుకు మెజార్టీ
2009 ముందు వరకు గోస్పాడు మండలం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆ మండలాన్ని నంద్యాల నియోజకవర్గంలో కలిపారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసిపి తరుపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భూమాకు ఒక్క గోస్పాడు మండలంలోనే 5000 పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది.
భూమా టిడిపిలో చేరినా.. జగన్ ధీమా అదే కానీ
ఆ తర్వాత భూమా టిడిపిలో చేరడం, ఆయన మృతి, ఉప ఎన్నికల నేపథ్యంలో.. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరినా ఆయన అనుచరులు మాత్రం ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. అందువల్ల వైసిపి తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదలేదనే ధీమాతో ఉంది.
ప్రశాంత్ కిషోర్ సర్వేతో ధీమా.. కానీ టిడిపి చెక్ పెట్టింది
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తాను చేయించిన సర్వేలో గోస్పాడు మండలంలో వైసిపి ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన భరోసాతో నంద్యాల గెలుపుపై కీలకంగా మారిన గోస్పాడు మండలంలో వైసిపి విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఇక్కడే కూడా వైసిపికి టిడిపి చెక్ పెట్టింది.
గంగుల ప్రతాప్ రెడ్డితో దెబ్బతిన్న జగన్
ఉప ఎన్నికల సమయంలో గంగుల ప్రతాప్ రెడ్డిని టిడిపిలో చేరారు. దీంతో కూడా వైసిపికి టిడిపి చెక్ పెట్టింది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో గంగులకు మంచి పట్టుంది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, లోకసభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం గంగుల సొంతం. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన వచ్చినప్పుడు తొలుత ప్రతాప్ రెడ్డితోనే జగన్ చర్చించారు. ఆయనకే టికెట్ ఇస్తారనే సమయంలో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడంతో ఆయనను ఖరారు చేశారు.
ఇదీ గంగుల బలం
గతంలో గోస్పాడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలలో ఉన్నా ఇప్పుడు నంద్యాల పరిధిలోకి వచ్చింది. ఇక్కడ గంగులకు మంచి పట్టుంది. మండలంలో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన గోస్పాడు, దీబగుంట్ల, యాలూరు, జిల్లెల్ల, సాంబవరం, పసులపాడు, చింతకుంట, నంద్యాల మండలంలోని కానాల, రైతునగర్ తదితర ప్రాంతాల్లో గంగుల వర్గానికి బంధుగణంతో పాటు ప్రత్యేక వర్గం ఉంది. ఇవన్నీ కలగలసి గోస్పాడు మండలంలో టీడీపీకి 1858 ఓట్ల ఆధిక్యం వచ్చాయి. గోస్పాడులో టిడిపి-10,521, వైసిపి 8,663 ఓట్లు పోలయ్యాయి.