నిలువునా ముంచారు: చంద్రబాబు ఘాటు విమర్శలు: పార్టీకి ఎస్పీవై రెడ్డి గుడ్ బై: స్వతంత్ర అభ్యర్థిగా!
కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించినదే అయినప్పటికీ.. నామినేషన్ల పర్వం మొదలైన సమయంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న నంద్యాల లోక్ సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. తనను నిలువునా ముంచేశారని నిప్పులు చెరిగారు. అయినప్పటికీ.. పోటీ నుంచి తప్పుకోవట్లేదని, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు. తనతో పాటు తన పెద్ద అల్లుడు కూడా నంద్యాల అసెంబ్లీ బరిలో నిల్చుంటారని స్పష్టం చేశారు.
హ్యాట్రిక్ హీరో.. ఎస్పీవై రెడ్డి
2014 లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అదే స్థానం నుంచి గెలుపొందిన ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి, హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే పార్టీ ఫిరాయించారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల లోక్ సభ స్థానంలో టీడీపీ నాయకత్వం తనకే టికెట్ ఇస్తుందని ఆయన చివరి నిమిషం వరకూ ఆశలు పెట్టుకున్నారు. వాటిని అడియాశలు చేస్తూ.. కొత్త వ్యక్తిని తెరమీదికి తీసుకొచ్చారు చంద్రబాబు.
రాయపాటికి జలక్..సీటు రద్దు..! : నర్సరావుపేట ఎంపీగా కొత్త అభ్యర్ది: టిడిపి లో కలకలం..!
కుటుంబ సభ్యులనూ కరుణించని చంద్రబాబు
తనకు లేకపోయినా, తన కుమార్తెకు గానీ, అల్లుడికి గానీ నంద్యాల అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి పలుమార్లు చంద్రబాబును అభ్యర్థించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమాధానాన్ని దాటవేస్తూ వచ్చిన చంద్రబాబు.. చివరి నిమిషంలో మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానంద రెడ్డి పేరును ప్రకటించారు. దీనితో తీవ్ర అసహనానికి గురైన ఎస్పీవై రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
నిలువునా ముంచేశారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు తనను నిలువునా ముంచేశారని ఎస్పీవై రెడ్డి ఆరోపించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడానికి చంద్రబాబు వద్ద ఒక్క కారణం కూడా లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయించే సమయంలో.. నంద్యాల లోక్ సభ టికెట్ ఇస్తాననే హామీతోనే తాను టీడీపీలో చేరానని చెప్పారు. ఎన్నికలు సమీపించే సమయాకిని కొత్త నాయకుడికి టికెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ.. తాను విశ్రమించబోనని, లోక్ సభ ఎన్నికల్లో నంద్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని అన్నారు. తన పెద్ద అల్లుడు స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు.