నంద్యాల:'నోటా'తో కాంగ్రెస్ పోటీ, ఏ రౌండ్లో వంద ఓట్లు దాటని ఖాదర్
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తిని కల్గించిన నంద్యాల ఉపఎన్నికలో అధికార టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించారు. అయితే ఊహించిన దాని కంటే టిడిపి అభ్యర్థి బ్రహ్మనందరెడ్డికి మంచి మెజారిటీ వచ్చిందని టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నోటాకు వచ్చిన ఓట్ల కంటే స్వల్ప తేడా మాత్రమే ఉంది.
నంద్యాల ప్రజల తీర్పును గౌరవిస్తాం: రఘువీరారెడ్డి
నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో వైసీపీ చీఫ్ జగన్ సుమారు 13 రోజులపాటు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల ఉప ఎన్నికలు టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్దానికి తెరతీశాయి. 2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికను సెమీ ఫైనల్స్గా భావించారు. దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపి ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేసింది. కర్నూల్ మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి హెచ్చరికల నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపిందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించాలని కూడ డిమాండ్ చేసింది.
నోటాకు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఓట్ల తేడా
నంద్యాల ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్కు 1382 ఓట్లు పోలయ్యాయి. ‘నోటా'ను 1231 మంది ఎంచుకున్నారు. ఈ లెక్కల్ని గమనించిన కొందరు నెటిజన్లు.. కాంగ్రెస్పై చలోక్తులు విరుసుతున్నారు. ‘నంద్యాల ఎన్నికల్లో నోటాతో పోటీపడ్డ కాంగ్రెస్' అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని నంద్యాల ఎన్నికలు స్పష్టం చేశాయంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోని పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నోటాతో కాంగ్రెస్ పోటీ
నంద్యాలలో టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున అబ్దుల్ ఖాదర్ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ఓట్ల ఆధిక్యంపై పోటీ నెలకొనగా.. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో భిన్నంగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు చూస్తే.. ‘నోటా'కు వచ్చిన ఓట్లతో పోటీ పడినట్లుగా అనిపించక మానదు. తొలి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఒక్క రౌండ్లోనూ 100 ఓట్లు కూడ కాంగ్రెస్ పార్టీకి దాటలేదు.
రాష్ట్ర విభజన కాంగ్రెస్కు దెబ్బ
2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. ఈ అవకాశాన్ని రాజకీయంగా టిడిపి, వైసీపీలు ఉపయోగించుకొన్నాయి. దీంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా పరాజయం పాలైంది.మెజారిటీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేరు. అంతేకాదు పోటీచేసిన చోట డిపాజిట్లు కూడ రాలేదు.
ఉనికి కోసం నంద్యాలలో కాంగ్రెస్ పోటీ
నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోటీచేసింది. ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడ ఉందని చెప్పేందుకు ఈ పోటీ చేసిందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. నంద్యాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపినా ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిల మధ్యే తీవ్రమైన పోటీ సాగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఓట్లను చీల్చితే వైసీపీకి నష్టమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.