నంద్యాల ఎఫెక్ట్: వైసీపీ కోటపై టిడిపి గురి, జగన్ అతి విశ్వాసం కొంపముంచిందా?
కడప: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫలితాల ప్రభావం కడప జిల్లాపై ఏ మేరకు ప్రభావం చూపుతోందనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.పలు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే దీని ప్రభావం వైసీపీ చీఫ్ జగన్ స్వంత జిల్లా కడపపై ఏ మేరకు ఉంటుందనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 13 రోజులపాటు ప్రచారం నిర్వహించారు. అయినా టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 27వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి 'ఆది' ఆసక్తికరం
నంద్యాల ఉపఎన్నికల ప్రభావం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై కూడ కన్పించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు టిడిపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.
బ్రహ్మనందరెడ్డిపై బాబు షాకింగ్, అదే శిల్పా సోదరులకు దెబ్బ, ముద్రగడ సత్తా తెలిసేది
అయితే తాము పార్టీ మారడం లేదని కొందరు వైసీపీ నేతలు కొందరు పార్టీకి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని పరిస్థితి నెలకొంది. ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేల చేరికపై విజయనగరం జిల్లాలో బహిరంగంగానే మాట్లాడారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే టిడిపిలో చేరేందుకు సిద్దమయ్యారని చెప్పారు.
కడప జిల్లాపై నంద్యాల ప్రభావమెంత?
కడప జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైసీపీ నుండి ఆదినారాయణరెడ్డి జయరాములు టిడిపిలో చేరారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి పాలు కావడం వైసీపీ శ్రేణులను ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టిడిపి నేతలు ధీమాతో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన నేతలపై టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.
అతి విశ్వాసమే కొంపముంచుతుందా?
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అతి విశ్వాసమే ఆయన కొంప ముంచుతుందనే వాదన కూడ లేకపోలేదు. అయితే ఈ అతి విశ్వాసం కారణంగానే జగన్ పార్టీ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికలు అధికారపార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చే సందర్భాలు గతంలో కూడ చోటుచేసుకొన్నాయి. అయితే నంద్యాల ఫలితం కారణంగా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదనే వాదన కూడ ఉంది.
కడపపై టిడిపి టార్గెట్
కడప జిల్లాలో వైసీపిపై పై చేయి సాధించాలని టిడిపి వ్యూహలను రచిస్తోంది. వైసీపీ నుండి ఇప్పటికే కీలకమైన ఆదినారాయణరెడ్డిని తమ వైపుకు లాగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినా ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాదు మంత్రిపదవిని కూడ ఇచ్చింది టిడిపి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోవడానికి ఆదినారాయణరెడ్డి చేసిన కీలకంగా వ్యవహరించారని టిడిపివర్గాలు చెబుతున్నాయి.
టిడిపి మైండ్ గేమ్
కడప జిల్లాలో వైసీపీని మానసికంగా దెబ్బతీసేందుకు టిడిపి మైండ్ గేమ్ ఆడుతోంది. కడప జిల్లాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ జిల్లాలో వైసీపీని ఏ మేరకు దెబ్బకొట్టగలిగితే ఆ మేరకు తమకు కలిసివస్తోందనే భావన టిడిపి నాయకత్వంలో ఉంది. దీంతో కడప జిల్లాలో టిడిపి మైండ్గేమ్ ఆడుతోంది. నంద్యాల ఫలితం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని టిడిపి వ్యూహం వైసీపీపై ప్రభావం చూపుతోంది. వైసీపీకి చెందిన నేతలు పార్టీని వీడేందుకు సంకేతాలు పంపుతున్నారని సమాచారం. అయితే ఇతర జిల్లాల ప్రభావం కడప జిల్లాపై కూడ పడే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆశతో ఉన్నారు.