నంద్యాలపై వీడని సస్పెన్స్: బాబుతో భేటీ, మెట్టు దిగని అఖిల, పట్టు వీడని శిల్పా
నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ ముఖ్యనేతలు ఈ రోజు జరిపిన చర్చలు ముగిశాయి. దీనిపై భూమా, శిల్పా వర్గాలు సీఎం చంద్రబాబు వద్దకు బయలుదేరాయి.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ టికెట్పై తెలుగుదేశం పార్టీలో సస్పెన్స్ వీడలేదు. అఖిలప్రియ, శిల్పాలతో చంద్రబాబు శనివారం సాయంత్రం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. సీనియర్ నేతలతో భేటీ తర్వాత ఇరు వర్గాలవారు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తానని చంద్రబాబు వారితో చెప్పినట్లు సమాచారం. అంతవరకు కలిసి పనిచేయాలని ఇరు వర్గాలవారికి చెప్పారు. అయితే, అసెంబ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మాత్రమే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఏర్పడ్డ వివాదాన్ని తెరదించేందుకు మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ ఈ రోజు మంత్రి అఖిలప్రియతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ భేటీలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్ లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు.
ఈ అంశంలో తుది నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకే వారు వదిలేశారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈ రోజు జరిపిన భేటీ విశేషాలని చంద్రబాబుకి కళా వెంకట్రావు వివరించారు.
పార్టీ మారను: శిల్పామోహన్రెడ్డి
నేతలతో చర్చల అనంతరం శిల్పా మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారే యోచనే లేదన్నారు. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు. ఈ విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు.