నంద్యాల జనానికి దిమ్మతిరిగింది?: 'ఒకప్పుడు భూమా రౌడీ.. ఇప్పుడు గొప్పోడు'
అప్పట్లో భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్న రోజులవి. అప్పటి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సాక్షిగా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
కర్నూలు: అనిశ్చితి.. అనైతికత.. రాజకీయాలకూ ఈ రెండూ ఇప్పుడు కేరాఫ్. అధికారం పరమావధి కానీ పంతాలు, పట్టింపులు దాని ముందు దిగదుడుపే అన్నట్లు వ్యవహరిస్తుంటాయి పార్టీలు. నిన్నటి దాకా రౌడీ, గూండా, అవినీతిపరుడు అంటూ ప్రత్యర్థిని దూషించినవాళ్లే.. పంచెన చేరాక పద్దతి మార్చేస్తారు.
ఏపీకి నంద్యాల బెట్టింగ్ ఫీవర్: సానుభూతి వర్సెస్ నైతికత?.. జనం ఎటువైపో!
నంద్యాల ఉపఎన్నిక పుణ్యమాని ఇప్పుడీ సీన్ అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంతకీ ఏంటా సీన్! అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రావాల్సిందే. అప్పట్లో భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్న రోజులవి. అప్పటి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సాక్షిగా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
ఒకప్పుడు 'రౌడీ' అని:
'మీ రౌడీయిజాన్ని బయట చూపించుకోండి.. సభలో చూపించాలని ప్రయత్నిస్తే సహించేది లేదు.. ఖబడ్దార్!' అంటూ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో భూమాపై మండిపడ్డారు. అంటే భూమాను ఓ రౌడీ కింద జమ కట్టినట్లే లెక్క. కానీ ఇది జరిగిన 6నెలలకే భూమా టీడీపీ గూటికి చేరిపోయారు. కేసులకు భయపడ్డారో.. లేక నిజంగా టీడీపీతోనే అభివృద్ది సాధ్యమనుకున్నారో.. మొత్తానికి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కొంతకాలానికే సీన్ రివర్స్:
దురదృష్టవశాత్తు.. ఆ తర్వాత కొంతకాలానికే గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. దీంతో నంద్యాలకు ఉపఎన్నిక తప్పలేదు. అలా ఉపఎన్నిక దగ్గరపడటంతో.. ప్రచారం కోసం టీడీపీ చాలామందినే నంద్యాలలో దింపింది. కర్నూలు జిల్లా ఇన్చార్జీగా ఉన్న కాల్వ శ్రీనివాసులుకు ఇప్పుడీ ఎన్నికను గెలిపించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో ఒకప్పుడు భూమాను 'రౌడీ' అంటూ పొగిడిన ఆయనే.. ఇప్పుడాయనకు ఓట్లు వేయాలని, నంద్యాలకు ఆయనెంతో చేశారని ప్రచారం చేస్తుండటం బహు విడ్డూరం.
అఖిలప్రియది అదే తీరు:
కాల్వ శ్రీనివాసులు సంగతి పక్కనపెడితే.. అటు అఖిలప్రియది కూడా అదే తీరు. ఒకప్పుడు తన తండ్రిని ఇబ్బందిపెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేసిన ఆమె.. ఇప్పుడు 'చంద్రబాబు గొప్ప నేత.. మా కుటుంబానికి అండగా నిలిచారు.. ఆయనవల్లే అభివృద్ది సాధ్యం కాబట్టి జగన్కు బుద్ది చెప్పండి' అంటూ ప్రచారం చేస్తున్నారు.
ముక్కున వేలేసుకుంటున్న జనం:
ఒకప్పుడు రౌడీ అని తిట్టిన నాయకుడే ఇప్పుడొచ్చి ఆయనకు ఓట్లు వేయాలని అడగడం.. నాన్నను ఇబ్బందిపెడుతున్నారంటూ అప్పట్లో వాపోయిన అఖిలప్రియ కూడా ఇప్పుడు సీఎంను పొగుడుతూ ఓట్లడగడం చూసి నంద్యాల జనం ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో అని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాల నిండా పేరుకుపోయిన అనిశ్చితిని.. దాని నైతికతను చూసి విస్మయం చెందుతున్నారు.