అక్రమార్జనతో ఫ్లైట్లలో తిరిగితే చాలా?, టీడీపీ నాశనమే: రమేష్పై సొంతపార్టీ నేత వరదరాజులు నిప్పులు
కడప: తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్పై ఆ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ నంద్యాల వరదరాజులు రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ రమేష్ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
దీని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
దమ్ముంటే అక్కడ చెయ్ రాజకీయాలు.. వైసీపీ నేతలకు ఫోన్లు..
సీఎం రమేష్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ కాల్ డేటాను పరిశీలిస్తే స్థానిక వైయస్సార్సీపీ నాయకులకు ఫోన్లు చేసిన విషయం బయటపడుతుందన్నారు.
దమ్ము, ధైర్యముంటే కడప, పులివెందుల మున్సిపాలిటీల్లో రాజకీయాలు చేయాలని సీఎం రమేష్కు వరదరాజులు రెడ్డి సవాల్ విసిరారు.
రమేష్కు వరదరాజులు రెడ్డి సవాల్
గతంలో చెప్పినట్లు గ్రామ రాజకీయాలకు ఎక్కువ, మండల రాజకీయాలకు తక్కువ అన్నారు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన సత్తాను చాటుకోవాలని సవాల్ విసిరారు. మున్సిపాలిటీలో రాజకీయాలు చేసేందుకు తాము అంగీకరించమని, సీఎం రమేష్ నాయకత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని వరదరాజులు రెడ్డి తేల్చిచెప్పారు. వరదరాజులరెడ్డి, సీఎం రమేష్ పరిస్థితి ఏమిటో సీఎం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు.
రమేష్ కుట్రలపై సీఎంకు ఫిర్యాదు చేస్తా
కాగా, ప్రొద్దుటూరు వ్యవçహారంపై సీఎంకు మరో మారు ఫిర్యాదు చేయనున్నట్లు వరదరాజులు తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తన వర్గీయులతో సమావేశం పెట్టి మున్సిపల్ చైర్మన్కు తెలపలేదన్నారు. రూ.80 కోట్లు ఖర్చు పెట్టాలంటే నిబంధనల ప్రకారం చేయాలన్నారు. తాను గెలిపించిన ప్రజాప్రతినిధులకు డబ్బులిచ్చి తనవైపు తిప్పుకుంటున్నారని సీఎం రమేష్పై ధ్వజమెత్తారు. తనపై చేసే కుట్రలు ఫలించవని అన్నారు.
అక్రమార్జనతో ఫ్లైట్లలో తిరిగితే సరిపోతుందా?
ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల వల్ల సీఎం రమేష్కు రెండో సారి రాజ్యసభ సీటు దక్కిందన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, అన్ని చోట్ల రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేస్తున్నారని వరదరాజులు విమర్శించారు. వేల కోట్లు అక్రమార్జన చేసి విమానాల్లో తిరిగితే ప్రజలెవ్వరు నమ్మరన్నారు. ప్రొద్దుటూరులో ఎంపీ రమేష్ తమ్ముడును నిలపాలని ఉన్నారని, అతనికి కూడా మా సహకారం కావాలి కదా అని అన్నారు. అయితే, తాము పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.